ఇకపై అలాంటి సినిమాలు చేయను : హీరో నిఖిల్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీ డేస్’ మూవీతో హీరోగా పరిచయం అయిన నిఖిల్ తర్వాత సోలో హీరోగా నటించాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పాటు చేసుకున్నాడు ఈ కుర్రహీరో. అయితే నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' మూవీ విషయంలో ఈ కుర్రహీరోకి చుక్కలు కనిపించాయి. గత రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ కావాలసిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మొన్న శుక్రవారం ఈ మూవీకి మోక్షం లభించింది.
తమిళంలో వచ్చిన 'కనితన్' సినిమాకి ఇది రీమేక్. అదే దర్శకుడు తెరకెక్కించిన 'అర్జున్ సురవరం' .. తమిళంలో కంటే తెలుగులో బాగా వచ్చిందనే టాక్ కూడా వినిపించింది. ఈ మూవీ ఫస్ట్ టాక్ బాగా రావడంతో సక్సెస్ బాటలో నడుస్తుంది. తొలిరోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తూ నిఖిల్ ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ మూవీ రిలీజ్ కావడానికి ఎన్నో అడ్డంకులు వచ్చాయని..కానీ ప్రేక్షకుల ఇంత మంచి ఆదరణ చూపిస్తారని అనుకోలేదని అన్నారు. గత ఏడాది రీమేక్ మూవీ అయిన 'కిరాక్ పార్టీ'లో నటించాడు.
ఆ సినిమా ఆయనతో పాటు అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 'అర్జున్ సురవరం' కూడా కోలీవుడ్ నుంచి కొనుక్కొచ్చిన కథనే. ఈ సినిమా మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే తాను ఇక ముందు రిమేక్ మూవీస్ జోలికి వెళ్లనని అన్నారు. రీమేక్ సినిమాల వలన ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో తనకు బాగా తెలిసి వచ్చిందని అన్నాడు. కార్తికేయ సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇక ముందు కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.