నేడు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు. ఈ ప్రమోషన్లు చిన్న నిర్మాతలకు పెద్ద తల నొప్పిని తెస్తున్నాయి. ఖర్చు భరించి ప్రమోషన్ చేసినా , దాన్ని సరైన సమయానికి విడుదల చేయడం కూడా అంతే కష్టం అవుతుంది. చిన్న సినిమాల్లో అయితే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా చిత్రీకరణ ఎప్పుడో ముగిసినా, థియేటర్లలో రావడానికి మాత్రం చాలా కష్టపడే సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎట్టకేలకు విడుదలకు సిద్దంగా ఉన్న ఈ మూవీని ప్రమోట్ చేసుకునే పనిలో పడింది చిత్రబృందం.
తమిళ మూవీ కణిథన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ విషయంలో వివాదం రేగింది. ముద్ర అనే టైటిల్తో పోస్టర్స్ రిలీజయ్యాయి. అయితే అదే టైటిల్తో మరో సినిమా రావడం, దానిపై నిఖిల్ నోరు జారడం.. నిర్మాతలు ఫైర్ అవ్వడం అప్పట్లో వైరల్ అయ్యయి. తీరా ముద్ర అనే టైటిల్ను మార్చేసింది చిత్రయూనిట్. టైటిల్ విషయంలోనే వివాదం రేగిన ఈ మూవీకి విడుదల చేయడానికి మాత్రం సరైన సమయం దొరకడం లేదు. తమ సినిమాకు టైటిల్ ను సూచించాల్సిందిగా సోషల్ మీడియాలో ఓ కాంటెస్ట్ ను కూడా పెట్టేశారు. దీంతో అందరి అభీష్టం మేరకు సినిమాలో నిఖిల్ పేరునే టైటిల్గా మార్చేశారు. అర్జున్ సురవరం అనే టైటిల్తో పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేకపోతోంది.
ఎట్టకేలకు తమ సినిమాను విడుదల చేసేందుకు సరైన సమయం దొరికినందుకు ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఈ మేరకు నిఖిల్ సోషల్ మీడియా చేసిన రచ్చ మామూలుగా లేదు. అర్జున్ సురవరంలో భాగంగా ఫ్యాన్స్తో ముచ్చటించాడు. సోషల్ మీడియాలో వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఈ మూవీ వచ్చే వారం విడుదల కానుండగా.. ఈ లోగా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని.. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్ర ఈవెంట్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్నారని సమాచారం. మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. నిఖిల్ జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: