కోలీవుడ్ లో స్టార్ హీరోగానే కాకుండా దర్శక, నిర్మాత,నేపథ్యగాయకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించాడు ధనుష్. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ ప్రత్యేక మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ధనుష్. తాజాగా ధనుష్, మాలీవుడ్ బ్యూటీ మంజు వారియర్ జంటగా నటించిన ‘అసురన్’ మూవీ సూపర్ హిట్ అయి ఏకంగా రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది. గత నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ధనుశ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వెంకటేశ్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ - కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి బయటికి వచ్చింది. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. తమిళంలో ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి దర్శకుడిని కూడా సెట్ చేశారట. 'రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కి 'అసురన్' తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సురేశ్ బాబుకి - ఓంకార్ కి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు.
కాగా, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సైతం ‘అసురన్’ రీమేక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. వరుస డిజాస్టర్ తో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న బాలీవుడ్ బాద్ షా నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మంచి కథల కోసం వెతుకుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ఇక అట్లీ దర్శకత్వంలో షారుక్ చేయబోయే సినిమా మాత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.