రక్షా బంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయాన్నే సోదరీమణులు వారి సోదరులకు రాఖీ పట్టీని కట్టి పండుగ జరుపుకున్నారు. ఇక బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీలలోని సెలబ్రిటీలు కూడా ఘనంగా రాఖీ జరుపుకున్నారు. టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ లో కూడా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
చిరంజీవికి ఆయన సోదరీమణులు మాధవి, విజయలు రాఖీ కట్టారు. సంప్రదాయబద్ధంగా అన్నయ్యకి హారతి ఇచ్చారు. అనంతరం మిఠాయి తినిపించి ప్రేమను చాటుకున్నారు. అలాగే అన్నయ్య ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఆ తర్వా త చిరు తన చెల్లెల్లకు కానుకలు అందించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ తన సోదరీమణులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఉపాసన సోషల్ మీడియాలో ఉంచారు. 'ప్రియమైన సోదరీమణులతో మామయ్య రక్షాబంధన్ వేడుకలు' అంటూ పేర్కొన్నారు. ఈ సీన్ మెగా అభిమానులకు చూడముచ్చటగా అనిపించింది.
ఇదికాస్తా నెటిజన్లకు నచ్చడంతో వైరల్ అయిపోయింది. మెగా అభిమానులు సహా నెటిజన్లు అందరూ ఈ ట్విట్టర్ పోస్ట్ కి తెగ లైకులు కొడుతున్నారు. తమదైన శైలిలో రక్షా బంధన్ గురించి కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవిలాంటి వ్యక్తి రక్షా బంధన్ జరుపుకోవడంతో తెలుగునాట ఈ పండుగకు మరింత క్రేజ్ వచ్చినట్లు అయింది.