హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యేకు రివర్స్ అవుతుందిగా!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. గతంలో పలుమార్లు మక్తల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. 2014లో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి...2016లో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి పోటీ చేశారు. టీఆర్ఎస్ వేవ్‌లో చిట్టెం మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే చిట్టెం తండ్రి నర్సిరెడ్డి గతంలో పలుమార్లు మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచాక...అనూహ్యంగా నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. దీంతో రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చి 2005 ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు. 2009లో ఓడిపోయిన ఈయన,  2014లో గెలిచారు. మళ్ళీ 2018లో టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇలా రామ్మోహన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు గెలవడంతో మక్తల్‌పై చిట్టెంకు బాగా పట్టు ఉంది. నియోజకవర్గంలో తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు.
నియోజకవర్గంలో ఇంకా బలపడటమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ శ్రేణులని టీఆర్ఎస్‌లోకి లాగేసుకుంటున్నారు. ఇక్కడ చిట్టెందే హవా అన్నట్లు పరిస్తితి ఉంది. అయితే ఇదొక నియంత పాలన మాదిరిగా వెళుతుందనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. కాకపోతే అధికార బలం ఉండటంతో ప్రజలు బయటకు మాత్రం అసంతృప్తి చూపించడం లేదు. సమయం వచ్చినప్పుడు చిట్టెంకు చుక్కలు చూపించాలని కొన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అటు మక్తల్‌, ఆత్మకూర్‌, అమర్‌చింత మున్సిపాలిటీల్లో అభివృద్ధి అంతంత మాత్రమే. అండర్ డ్రైనేజ్ సరిగ్గా లేదు. తాగునీటి కష్టాలు ఎక్కువే. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల వసతి కూడా సరిగ్గా లేదు. రాజకీయంగా చూస్తే వరుసగా గెలుస్తూ వస్తున్న చిట్టెంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ నేత దయాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మొత్తానికైతే మక్తల్‌లో ఈ సారి కారు ఎమ్మెల్యేకు రివర్స్ అయ్యేలా ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: