భద్రాద్రి ఆలయానికి రండి...కానీ...
ఈనెల 8 నుంచి భద్రాద్రి రాయాలయంలోకి భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు ఆలయ అధికారులు శనివారం విలేఖరులకు తెలిపారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి ఇప్పటి వరకు ఆలయం మూత పడిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో అర్చకులు నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ పూజలు జరిగాయి. తిరిగి స్వామి వారి దర్శనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కొన్ని సూచనలను భక్తులకు వెల్లడిస్తున్నారు.
ఈ నెల 8, 9 తేదీల్లో భద్రాద్రి రామాలయం, పర్ణశాల రామాలయంలోని హుండీల్లో నగదు లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో నర్సింహులు తెలిపారు. దీంతో దేవస్థాన ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందుతుందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత నెల నుంచి వేతనాలు నిలిచిపోయాయి. తిరిగి భక్తుల దర్శనాలు ప్రారంభకానుండటంతో వారి సమస్య కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే పదేళ్లలోపు ఉన్న పిల్లలకు, 65 ఏళ్లుపై బడిన వృద్ధులకు ఆలయంలోకి అనుమతి ఉండబోదని తెలిపారు. అలాగే దేవస్థానం పరిధిలో కాటేజీ సౌకర్యం ఉండదని తెలిపారు. ఇక ఆలయ పరిసరాల్లో భక్తులు ఎక్కువ మంది గుమికూడి ఉండవద్దని, దర్శనం చేసుకున్న వెంటనే ఆలయ పరిసరాల నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.
స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించాలని అధికారులు తెలిపారు. ఇక ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే ప్రాంగణానికి ముందు భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించాకే లోనికి అనుమతివ్వడం జరుగుతుందని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రామయ్య కల్యాణం అత్యంత నిరాండబరంగా సాగిన విషయం తెలిసిందే. కేవలం ఆలయ సిబ్బంది కొద్ది మంది ప్రజాప్రతినిధులు మాత్రమే కల్యాణ వేడుకలకు, ఆ తర్వాత జరిగిన పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన విషయం తెలిసిందే. ఈనెల 8 నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో రామయ్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.