చరిత్రలో ఈరోజు : 19-08-2020 రోజున ఏం జరిగిందంటే..?
శంకర్ దయాల్ శర్మ జననం : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పండితుడు అయిన శంకర్ దయాల్ శర్మ 1918 ఆగస్టు 19వ తేదీన జన్మించారు. భూపాల్ నగరంలో జన్మించిన శంకర్ దయాల్ శర్మ.. భారతదేశపు రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. 1992 నుంచి 1997 వరకు భారత రాష్ట్రపతిగా కొనసాగారు శంకర్ దయాల్ శర్మ. అంతే కాకుండా ఇంతకుముందు ఉపరాష్ట్రపతి గా కూడా పనిచేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన శంకర్ దయాల్ శర్మ.. విద్యా శాఖ న్యాయ శాఖ మొదలైన శాఖలకు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 1940 దశకంలో భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న శంకర్ దయాళ్ శర్మ అదే దశకంలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరకు అదే పార్టీకి విధేయులుగా ఉన్నారు.
కొత్తపల్లి పున్నయ్య జననం : ప్రముఖ న్యాయవాది రాజకీయ నాయకుడు అయినా కొత్తపల్లి పున్నయ్య 1923 ఆగస్టు 19 వ తేదీన జన్మించారు. న్యాయవాదిగా ఎంతో గుర్తింపు పొందిన కొత్తపల్లి పున్నయ్య 1955 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి యునైటెడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన కొత్తపల్లి పున్నయ్య విద్యా రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 1962 లో మొదటిసారిగా పొందూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు కొత్తపల్లి పున్నయ్య. అయితే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో కొత్తపల్లి పున్నయ్య కుల వివక్షతను అంతమొందించడానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు.
అట్లూరి పుండరీకాక్షయ్య జననం : తెలుగు సినిమా నిర్మాత రచయిత నటుడు ఎన్టీఆర్ తో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి నాటకాలు వేసిన వ్యక్తి అయినా పుండరీకాక్షయ్య 1925 ఆగస్టు 19వ తేదీన జన్మించారు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన అట్లూరి పుండరీకాక్షయ్య... కర్తవ్యం అనే సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీద కనిపించారు. 1951లో రామారావు పిలుపుమేరకు మద్రాసు వెళ్లిన ఈయన... విజయ అనే సంస్థలో 100 రూపాయల జీతంతో పని చేశాడు. ఆ తర్వాత క్రమక్రమంగా నిర్మాతగా ఎదిగి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు పుండరీకాక్షయ్య.
బిల్ క్లింటన్ జననం : అమెరికా 42వ అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ 1946 ఆగస్టు 19వ తేదీన జన్మించారు. ఈయన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో.. తన భార్య కూతురు తో కలిసి ఆంధ్రప్రదేశ్ ను సందర్శించారు. అయితే బిల్ క్లింటన్ పర్యటన నేపథ్యంలో బిచ్చగాళ్ళు అందరిని తరిమివేశారు.
పడాల బాలకోటయ్య మరణం : ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు న్యాయనిర్ణేత రమ్య కళారంజని వ్యవస్థాపకులు వైద్యులు అయిన పడాల బాలకోటయ్య 2015 ఆగస్టు 19 వ తేదీన మరణించారు. అమ్మాయి వేషంలో తొలిసారి రంగస్థలంపై అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత నాటక రంగంపై మక్కువ పెంచుకున్నారు. ఇక హీరోయిన్ గా సుశీల అనే నాటకం వేసి ఎంతో మందిని ఆకట్టుకున్నారు పడాల బాలకోటయ్య. ఎక్కువగా మహిళా పాత్రలు వేస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. స్త్రీ పాత్రలకే పరిమితం కాకుండా పురుష పాత్రలు కూడా వేసారు పడాల బాలకోటయ్య.