కేసీఆర్ జీవితం ఇక ఫామ్హౌస్కే పరిమితమా?
ఎంపీ ఎన్నికల్లో అతి పెద్ద ఓటమి..
సమయం కోసం ఎదురుచూపులు..
కేసీఆర్.. సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఓ ఉద్దండ పిండం. ఏనాడో చెన్నారెడ్డి కాలంలో ఉవ్వెత్తున ఎగసి.. ఆ తర్వాత చల్లారిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి.. 14 ఏళ్లపాటు పోరాటం చేసి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ సాధనను సుసాధ్యం చేసిన అపర చాణక్యుడు. అయితే ఎంతటి నేతకైనా గడ్డు కాలం తప్పదు. ప్రస్తుతం కేసీఆర్ జీవితంలో అదే నడుస్తోంది. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణలో అంతులేని ఆధిపత్యం సాధించాడు.
తెలంగాణ సాధించాక.. అద్భుతంగా పాలన సాగించి ఆంధ్రావాళ్లు కూడా మెచ్చుకునేలా అభివృద్ధి చేసి చూపించాడు. ప్రత్యర్థులు కనీసం ఊహించని లేని పథకాలు పెట్టి.. జనంతో సెభాషనిపించుకున్నాడు. కానీ.. రానురాను మితిమీరిన అహంభావం, జనంతో తగ్గిపోయిన సంబంధాలు, అడుగడుగునా కుటుంబ పెత్తనం, రాజరికపు పోకడలు.. కేసీఆర్ను క్రమంగా పతనం చేశాయి. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన కేసీఆర్.. ఆ తర్వాత మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవకపోవడం ఆ పార్టీకి నిజంగా ఆత్మహత్యా సదృశ్యమే. దీనికి తోడు గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో కొందరు అప్పుడే కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఇంకా ఈ వలసలు కొనసాగుతున్నాయి.
అయితే.. మరి కేసీఆర్ పని అయిపోయిందా.. ఆ మాట అప్పుడే అనేందుకు వీలు లేదు. ఎందుకంటే ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలోనూ లుకలుకలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంకా పాలనలో కుదురుకోలేదు. దీనికి తోడు బీజేపీ కూడా బలపడుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడూ బలంగా ఉంటే.. అది కేసీఆర్కు ఎప్పుడూ పాజిటివ్ అవుతుంది. మూడు ముక్కలాటలో బీఆర్ఎస్ కే విజయావకాశాలు ఉంటాయి. ఇల్లు అలకగానే పండగ కాదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంత సులభం కాదు.
బీఆర్ఎస్కు మంచి నాయకగణం ఉంది. అవకాశం వచ్చినప్పుడు.. అందిపుచ్చుకునే నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి కాలం అనుకూలంగా లేకపోయినా.. సమయం వచ్చినప్పుడు విజృంభించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కాచుకుని కూర్చుంటారని మరిచిపోకూడదు. అందుకే కేసీఆర్ శకం ముగిసిందని చెప్పడం తొందరపాటే అవుతుంది.