ఇంతకీ ఆ పాపం బాబు సర్కారుదా.. జగన్ సర్కారుదా?

వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. దీంతో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62023 పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44954 పాఠశాలలు, ప్రైవేట్ యాజమాన్యంలో 15784 , ఎయిడెడ్ లో మరో 1225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మరో 60 బడులు ఉన్నాయి.

అయితే గతంలో పాఠశాలల ప్రారంభం రోజునే యూనిఫాంలు, పుస్తకాలు అందజేశారు. కానీ  ఈసారి అలా జరగలేదు. దీనిని చంద్రబాబు వైఫల్యంగా చిత్రీకరిద్దామన్నా ఆయన గురువారమే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.  మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి అంటే.. ఈ లోపానికి కారణం గత వైసీపీ ప్రభుత్వమే అని  ఆ పార్టీ అనుకూల పత్రిక సాక్షి ఒప్పుకుంది. ఈ మేరకు ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత విద్యా సంవత్సరం వరకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పాఠశాల తెరిచిన రోజునే అందించేవారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు, ఇంగ్లీష్, తెలుగు నోట్ బుక్స్, రెండు జతల సాక్సులు, జత బూట్లు, బెల్టు, స్కూల్ బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ ను అందించేవారు.

2024-25 విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే రూ.1042.53 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సరఫరా దార్ల నుంచి పూర్తి స్థాయిలో వస్తువులు స్టాక్ పాయింట్ల వద్దకు చేరలేదు. దీంతో వీటిని ఈ నెల 20 తర్వాత విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నూతన విద్యా సంవత్సరం కేలండర్ ని పాఠశాల విద్యాశాఖ ప్రకటించేది. అయితే ఈ సారి 1000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లు కూడా ఉండటంతో ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీబీఎస్ఈ అధికారులతో కలిసి ఎస్సీఈఆర్టీ అధికారులు నూతన క్యాలెండర్ ను రూపొందిస్తున్నారు. అంటే ఇవి ఆలస్యం అవ్వడానికి కారణం వైసీపీయేనని చెప్పకనే చెప్పినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: