చంద్రబాబు: 2 రోజుల్లోనే 80% ఫించన్లు.. డ్యామేజీ తగ్గిందిగా?

చంద్రబాబు, టీడీపీ నేతలు గుడ్‌ న్యూస్‌.. రెండు రోజుల్లోనే ఫించన్ల పంపిణీ దాదాపు 80 శాతం  పైగా పూర్తయింది. అంటే పింఛనర్ల కోపం కాస్త టీడీపీపై తగ్గినట్టే.. ఈ రెండు రోజులు బాగానే టీడీపీని పింఛనర్లు తిట్టుకున్నారనుకోండి.. అది వేరే విషయం.. ఇకపై మాత్రం తిట్టరు కదా. అయితే.. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలో చట్టబద్ధంగా భాగస్వాములని.. వాలంటీర్స్ చట్టబద్ధమైన వ్యవస్థలో ఉద్యోగులు కాదని.. వారికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

వాలంటీర్లు కాంట్రాక్టు లేదా  పొరుగు సేవలు అందించే ఉద్యోగుల తరహా ఉద్యోగులు కాదని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన ప్రయివేటు సైన్యమే వాలంటీర్స్ వ్యవస్థ అని వారు అంటున్నారు. వారికి, ప్రభుత్వ ఖజానా నుండి గౌరవ వేతనం కింద ఐదు వేలు చెల్లిస్తున్నారని.. గతంో గౌరవ వేతనం పెంచమని వాలంటీర్స్ విజ్ఞప్తి చేస్తే, మీరు "సేవకులు" మాత్రమేనని ముఖ్యమంత్రి వారికి హితబోధ చేశారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

రాజకీయ లబ్ధికోసమే ఏర్పాటు చేసుకొన్న చట్టబద్ధం కాని వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ. 73 & 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలను పటిష్టవంతం చేయడానికి బదులు వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి బలహీనపరిచారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ప్రస్తుతం సాధారణ ఎన్నికల నియమావళి అమలులో ఉంది. చట్టబద్ధమైన వ్యవస్థలో విధులు నిర్వహించే ఉద్యోగులుకాని వాలంటీర్స్ ను ఎన్నికల కమీషన్ పక్కన పెట్టడం స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ముందు షరతు.

కొన్ని నెలల క్రితమే ఎన్నికల కమీషన్ వాలంటీర్స్ ను ఎన్నికలకు సంబంధించిన పనుల నుండి దూరం పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, పాలక పార్టీ ఆ ఆదేశాలను ఖాతరు చేయకపోగా ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసింది. ఎన్నికల కమీషన్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. పైపెచ్చు, హైకోర్టు కూడా ఆదేశించింది. వాలంటీర్స్ లేకపోతే పాలనా యంత్రాంగమే స్థంభించిపోయిందన్న వాతావరణం సృష్టించడం సరి కాదని.. రెండు రోజుల్లోనే దాదాపు పూర్తయిన ఫించన్ల పంపిణీ తెలుపుతోందన్నది టీడీపీ నేతల వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: