ఏపీ: బీజేపీ అసలైన కార్యకర్తల ఫీలింగ్స్ ఏంటి?
ఏది ఏమైనా ఇరు పార్టీల మధ్య పొత్తు అయితే పొడిచింది. మూడు పార్టీలు కలిసే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాయి. అయితే కార్యకర్తల మనోభీష్టం వేరు.. పార్టీ నాయకుల అభిప్రాయాలు వేరే ఉంటాయి. జనసైనికుల ఆలోచన పవన్ ను సీఎం చేయాలని ఉంటుంది. అదే సందర్భంలో బీజేపీ కార్యకర్తలకు మరోసారి మోదీ ప్రధాని కావాలని ఉంటుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని పలు జాతీయ సంస్థల సర్వేలు చెబుతున్న వేళ.. ఏపీలో తమ బలం పెంచుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు ఉవ్విళూరుతున్నారు.
కానీ పార్టీ అధిష్ఠానం మాత్రం టీడీపీతో పొత్తుకు మొగ్గు చూపింది. దీనిపై ఆ పార్టీ అసలైన కార్యకర్త తన మనోవేదనను ఈ విధంగా ప్రకటించారు. ఏపీలో పొత్తు ఎవరి కోసం. దేశ అభివృద్ధిలో ఏపీ భాగస్వామ్యం కోసం. జనసేన, బీజేపీ సాయంతో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా. ప్రస్తుతం ఏపీలో ఉన్న రెండు పార్టీలు హిందూ వ్యతిరేక పార్టీలే. వైసీపీ బహిరంగంగానే క్రైస్తవులకు మద్దతు ఇస్తోంది.
టీడీపీ కూడా తక్కువేమీ కాదు. తాము అధికారంలోకి ప్రతేక బడ్జెట్ తో ముస్లింలకు నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు. హిందూ ఎజెండాతో కేంద్ర బీజేపీ ఎన్నికలకు వెళ్తుంటే..ఏపీలో మాత్రం హిందువుల బాధను పట్టని వారు ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ బలోపేతం దిశగా చర్యలు తీసుకోకుండా చంద్రబాబుని ఎలా గద్దెనెక్కించాలని ఏపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. కనీసం సీట్లు అయినా పార్టీ కోసం కష్టపడే నాయకులకు కేటాయించాలని కోరుతున్నారు.