బీజేపీతో పొత్తు.. చంద్రబాబు లెక్కలు ఇవే?

చంద్రబాబు వ్యూహాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం.  తన స్వప్రయోజనం లేకుండా రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు తమ్ముళ్లకి నచ్చడం లేదు. అవేంటంటే నోటా కన్నా తక్కువ శాతం ఓట్లు పొందిన బీజేపీతో పొత్తుకు వెంపర్లాడటం, ఇప్పుడిప్పుడే బలపడుతున్న జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల సీట్లను కోల్పోయే ప్రమాద ముందని తద్వారా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

కానీ ఆయన పక్కా లెక్కలతోనే ఈ సారి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు అనిపిస్తోంది. తన సన్నిహితులతో చంద్రబాబు చెప్పే లెక్కేంటంటే.. గత ఎన్నికల్లో పది శాతం ఓట్ల వ్యత్యాసం అధికార వైసీపీకి, టీడీపీకి ఉంది.  మనం తప్పకుండా 140-150 సీట్లలో పోటీ చేస్తాం. 100కి తగ్గకుండా మనం విజయం సాధించాలి. 2014లో ఇదే జరిగింది. కూటమితో కలసి వెళ్లినా 102 స్థానాల్లో గెలుపొందాం. అందుకే ప్రభుత్వాన్ని ఎవరి పై ఆధారపడకుండా నడిపించగలిగాం. ఇప్పుడు కూడా అలాగే విజయం సాధించాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన ఎలాగూ గెలవలేదనే ఉద్దేశంతో ఆ పార్టీ కార్యకర్తలు మూడు శాతం మంది వైసీపీకి ఓటేశారు.  

ఇప్పుడు జట్టు మూలంగా వీరంతా మన వైపునకు వచ్చేస్తారు. అలాగే బీజేపీ ఓటు బ్యాంకు కూడా గతంలో వైసీపీకి మళ్లింది. ప్రస్తుతం వీరంతా మన కూటమిని ఆదరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరి ఓట్లు శాతం కూడా 3-5శాతం వరకు ఉంటుంది. తటస్థులు 2శాతం ఉన్నా మొత్తం పది శాతం వరకు మనకు ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నారు.  జనసేనకు గతంలో ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి కనీసం మూడు శాతం మనవైపు మళ్లినా అంతిమ విజయం మనదే అని చెబుతున్నారు. ఈ లెక్కల వల్లే మనకి పొత్తులు అనివార్యం అని తన సన్నిహితులతో చెబుతున్నారు. చూద్దాం మరి ఈ లెక్కలు విజయవంతం అవుతాయే లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: