పవన్‌ కల్యాణ్‌.. తప్పటడుగులు వేయొద్దు?

పవన్ కల్యాణ్ ఇటీవల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరిలో భూమి పూజ చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ప్రత్యేక యాగం చేశారు. సామాజిక పరివర్తన, ధర్మ రక్ష పరిపాలన అనే విధానాలతో ప్రజలందరూ బాగుండాలని యాగం చేపట్టారు. అయితే మంగళగిరిలో చేపట్టిన యాగం ప్రజల సంక్షేమం కోసమని చెప్పారు. ఇదే సమయంలో వారాహి యాత్ర చేపట్టేందుకు ముందు యాగం నిర్వహణ తలపెట్టారు. వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కూడా కోరుకున్నట్లు తెలుస్తోంది.


అయితే పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. అక్కడ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఆంధ్రలో వైసీపీ, టీడీపీ తర్వాత అంత ఓటింగ్ శాతం ఉంది మాత్రం జనసేనకే. కానీ తెలంగాణలో మాత్రం జనసేనకు ఓట్ల శాతం లేదు. జనసేనకు కొంతమంది అభిమానులు ఉండొచ్చు. కానీ పోటీ చేస్తే గెలిచేంత మాత్రం లేరని చెప్పొచ్చు.


ఇలాంటి సందర్భంలో ఒంటరిగానే పోటీ చేయాలని భావించడం, తెలుగుదేశంలో పొత్తు లేదని చెప్పడంతో తెలంగాణలో జనసేనకు ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. జనసేన పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడ దానికి ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఏ ప్రాంతంలో పవన్ గాలి వీచే అవకాశం ఉంది. కనీసం ఒక్క స్థానంలో అయినా గెలిచే అవకాశం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.


అదే ఆంధ్రలో ఫోకస్ పెడితే కనీసం 20 స్థానాల వరకు పవన్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. గతంలో కంటే పవన్ ఛరిస్మా పెరగడం, పది సంవత్సరాల నుంచి పార్టీ ఆంధ్రలో పలు సమస్యలపై ప్రశ్నించడం చూస్తున్న జనం ఈ సారి జనసేనకు మంచి అవకాశం ఇచ్చే విధంగా ఉన్నట్లు కొన్ని సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఇదే సందర్భాన్ని పవన్ కల్యాణ్ సరియైన విధంగా అందిపుచ్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: