బిగ్‌డౌట్‌: ఆయన కేటీఆరేనా..? కేసీఆర్ పూనేశాడా..?

కేటీఆర్‌.. కల్వకుంట్ల తారక రామారావు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకైక కుమారుడు.. విద్యాధికుడు.. అమెరికాలో ఉండి వచ్చినవాడు.. అక్కడే ఉద్యోగం చేస్తూ.. తెలంగాణ ఉద్యమం వేడెక్కిన తర్వాత ఇండియాకు వచ్చేశాడు.. ఆ తర్వాత తండ్రితో పాటే తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొని నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. అసలే ప్రాంతీయ పార్టీ.. అందులోనూ చురుకుదనం, వాగ్ధాటి ఉన్ననాయకుడు. అందుకే ఆయన వారసత్వాన్ని పెద్దగా పార్టీలో ఎవరూ కాదనలేకపోయారు. అప్పటి వరకూ వారసత్వంపై ఆశలు పెట్టుకున్న అల్లుడు హరీశ్ రావు సైతం సైలంట్‌గా సైడ్ అయ్యారు.

కేసీఆర్ నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న కేటీఆర్‌ ప్రసంగాల విషయంలో మాత్రం తండ్రితో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంటాడు. తండ్రి కేసీఆర్ పక్కా ఊర మాస్‌ భాష మాట్లాడితే.. కేటీఆర్‌ మాత్రం ఎప్పుడూ సంయమనంతో పద్దతిగా మాట్లాడతారు. ఎప్పుడూ చిల్లరగా మాట్లాడటం.. వెకిలిగా మాట్లాడటం.. బూతులు తిట్టడం.. అవహేళనగా మాట్లాడటం ఉండదు.. చాలా పద్దతిగా సంయమనంగా మాట్లాడతారు. అందుకే.. కేసీఆర్‌ అంటే ఇష్టపడని వారు కూడా కేటీఆర్‌ను ఇష్టపడతారు.

హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులు కేటీఆర్‌ను ఇష్టపడటానికి ఈ డిగ్నిటీ కూడా ఓ కారణం. అయితే.. ఇవాళ బీజేపీ తీరుపై మండిపడుతూ ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్ తన ప్రసంగంలో అచ్చం కేసీఆర్‌ను తలపించారు. కేసీఆర్‌ కు మతి భ్రమించిందని జేపీ నడ్డా విమర్శించడంతో.. కేటీఆర్ కోపం నషాళానికి అంటినట్టుంది. అందుకే.. ఆయనలోను సంస్కారం కాస్త పక్కకు వెళ్లి తన తండ్రి కేసీఆర్ భాష బాగా బయటకు వచ్చేసింది.

అందుకే.. నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. నువ్వు వెళ్లాల్సింది ఎర్రగడ్డ.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెంటలెక్కింది.. ఎవడు వాడు.. అంటూ పరుషంగా మాట్లాడారు కేటీఆర్‌.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అచ్చం కేసీఆరే ప్రెస్‌ మీట్ పెట్టాడా అనిపించేలా సాగింది కేటీఆర్ ధోరణి. కేసీఆర్‌ ఫైరింగ్ చూసిన వాళ్లంతా ఈయన కేటీఆరేనా.. కేసీఆర్ పూనేశాడా అనుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: