నేలకు దిగిన మోడీ.. కాదు.. కాదు.. దించారు..?

మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ నేలకు దిగారు. నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే రజినీకాంత్ తరహాలో అహంభావంతో ఉండే మోడీ.. చాలా రోజుల తర్వాత తన స్వభావానికి భిన్నంగా  నేలకు దిగారు.. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా.. ప్రపంచం అంతా మేలుకున్నా.. తాను మాత్రం ఎలక్షన్స్ ర్యాలీల్లో బిజీగా ఉన్న మోడీ.. ఇన్నాళ్లకు మళ్లీ నేలకు దిగారు. దేశం కరోనా కోరల్లో చిక్కినా కుంభమేళాలను అనుమతులిచ్చేసిన మోడీ.. ఇప్పుడు నేలకు దిగారు.

కొవిడ్ సెకండ్ వేవ్ తో ప్రపంచం అంతా టీకాల కోసం వెంపర్లాడుతుంటే.. పేరు కోసం ఇతర దేశాలకు దానం చేసిన మోడీ.. ఎట్టకేలకు నేలకు దిగారు. ముందు చూపు లేకుండా ఆక్సిజన్ ఏర్పాట్లు చేయలేక జనం మరణయాతన పడుతుంటే జనం కోసం మొసలి కన్నీరు కార్చారని ఆరోపణలు ఎదుర్కొన్న మోడీ మొత్తానికి నేలకు దిగారు. టీకాల బాధ్యత సగంలోనే రాష్ట్రాల మీదకి వదిలేసి.. అడ్డగోలు వ్యాక్సిన్ విధానంతో గందరగోళపరిచిన మోడీ ఎట్టకేలకు నేలకు దిగారు.

కేంద్ర వ్యాక్సీన్ విధానం మొదటి నుంచి గందరగోళంగానే ఉంది. అసలు దేశ జనాభాకు సరిపడా వ్యాక్సీన్లు తెద్దామన్న ఆలోచనే సరిగ్గా లేదు. కేవలం రెండు కంపెనీలపైనే ఆధారపడి వ్యాక్సిన్ల కొనుగోలుపై దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత మధ్య వ్యాక్సీన్లను మార్కెట్లోకి వదిలేశారు.. రాష్ట్రాలే కొనుక్కోవాలన్నారు. కొందామంటే వ్యాక్సీన్ల కంపెనీలు రాష్ట్రాలకు ఇవ్వవు. ఇలా మొత్తం గందరగోళం చేసేసిన మోడీ.. రాష్ట్రాధినేతల విమర్శలతో కళ్లు తెరిచారు.
సాధారణంగా ఎన్ని విమర్శలు వచ్చినా తీరు మార్చుకోని మోడీ... ఎందుకో వ్యాక్సీన్ల విషయంలో మాత్రం కాస్త వెనక్కు తగ్గారు. వాస్తవానికి మోడీ నేలకు దిగలేదు. అంతా కలిసి దించేశారు.. ఏదేమైనా ఇది తన సహజ ప్రవర్తనకు కాస్త భిన్నమే. కానీ ఈ దిద్దుబాటు ఆహ్వానించదగితే.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే కదా అసలైన నాయకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: