చంద్రబాబు ఆ విషయం ఎందుకు అడగలేదు..? యనమలా.. నువ్వు చెప్పిందే కదయ్యా..?
అసలు వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు అసెంబ్లీలో సెలక్ట్ కమిటీకి పంపమని అడగనేలేదని గుర్తు చేస్తున్న తమ్మినేని సీతారామ్.. చంద్రబాబు ఎందుకు అడగలేదని నిలదీశారు. అసెంబ్లీలో అడగకుండా శాసన మండలిలో అడగడం వెనుక ఉద్దేశమేంటి అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, సెలక్ట్ కమిటీలో పెండింగ్ ఉందని కోర్టులో చెప్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్లో ఎలా ఉంటుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్ జరగాలని, ఓటింగ్ జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై లాజిక్కులు మాట్లాడుతున్న యనమల రామకృష్ణుడుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యనమల రామకృష్ణుడికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు. 1997లో శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. యనమల ఇచ్చిన రూలింగ్ ఇప్పటికీ అమలులో ఉందని... అదే యనమల ఇప్పుడు ఎలా విభేదిస్తారు ? శాసనసభ నిర్ణయాలపై ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? యనమల ఆరోజు ఇచ్చిన రూలింగ్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాలి అంటూ తమ్మినేని సీతారామ్ నిలదీశారు. కోర్టులో కేంద్రం చాలా స్పష్టంగా చెప్పిందని.. శాసనసభ వ్యవహారాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసిందని స్పీకర్ గుర్తు చేశారు.