అందగత్తెల అరాచకం.. తట్టుకోలేకపోతున్న గుంటూరోళ్లు?
గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ బండారు సురేశ్బాబు తెలిపారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. గుజరాత్లోని దుర్గానగర్కు చెందిన ఐదుగురు యువతులు గుంటూరు సమీపంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారట. తమది గుజరాత్ అని.. ప్రకృతి వైపరీత్యాలతో తమ గ్రామం లేకుండా పోయిందంటూ కరపత్రాలను పంచుతున్నారు. సాయం చేయాలని డబ్బులు అడుగుతున్నారు.
అయితే.. డబ్బులు ఇవ్వని వాహనదారులను ఏకంగా బెదిరిస్తున్నారు. తిడుతున్నారు.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాదు.. వాహనాల తాళాలు లాక్కొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసు పెడతామని ఉల్టా బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నారు. దీంతో గుంటూరుకు చెందిన సాయితేజరెడ్డి అనే వాహనదారుడు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుతో సదరు యువతులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ గుజరాత్ మహిళలు మొత్తం 30 మందికి పైగా ఉన్నారట. దీంతో పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి వీరి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం వెదుకుతున్నారు. గతంలో హైదరాబాద్లోనూ ఇలాంటి ముఠా ఒకటి హల్ చల్ చేసింది. వీరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తీసుకొచ్చినా..వారిలో ఎలాంటి బెరుకు లేకపోవడం విశేషం, పుట్టింటికి వచ్చినంత సింపుల్గా వీరు వ్యవహరించిన తీరు పోలీసులనే ఆశ్చర్యపరిచింది. మరి వీరి వెనుక ఎవరైనా ఉన్నారా.. వీరే ఇలా చేస్తున్నారా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.