సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది డిమాండ్ 40 శాతం పెరిగింది. ఫిక్స్డ్-వింగ్ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు అధిక గిరాకీ ఉంది. మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండటం వల్ల హెలికాప్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం డిమాండ్కు తగ్గ స్థాయిలో విమానాలు, హెలికాప్టర్లు లేవు. అధిక డిమాండ్ నేపథ్యంలో వీటిని లీజుకు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ సేవలకు ఛార్జీలను గంటల లెక్కన ఉంటాయి.
2023 డిసెంబరు నాటికి దేశంలో 112 నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి. ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తాయి. ఈ సంస్థల దగ్గర దాదాపు 350 విమానాలు, 175 వరకు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవే. గిరాకీ అధికంగా ఉన్న దృష్ట్యా హెలికాప్టర్లకు గరిష్ఠంగా గంటకు మూడున్నర లక్షల వరకూ ఇచ్చేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి.