ఏపీలో రెడ్ల ప్రభుత్వం రావాలి.. రావాలి అన్నారుగా వచ్చిందిగా.. ఇప్పుడు అందరికీ బుద్ధి వచ్చింది అని సీనియర్ కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఎవరూ కూడా ప్రభుత్వం ఇచ్చే రూ.500, రూ.వెయ్యి కోసం ఆశపడవద్దని, సొంతంగా సంపాదించుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఏ పార్టీ తరఫున పోటీచేస్తానో, ఏ పార్టీ టికెట్ ఇస్తుందో తెలవదని, తానుమాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో మంత్రులంతా డమ్మీలుగా మారిపోయారని, పొలం కౌలుకు చేద్దామంటే రైతులే ముందుకు రాని పరిస్థితి ఉందన్నారు. తన సొంతపొలం ఇద్దామనుకున్నా ఎవరూ కౌలురైతులే లేరన్నారు. ప్రభుత్వంలో తప్పు చేసినవారు తప్పకుండా జైలుకు వెళడం ఖాయమన్నారు. సమాజంలో జరుగుతున్న, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మీడియా బాద్యత అని, అలా లేకుండా సమాజం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.