తెలంగాణలో లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదిరోజుల పాటు ఈ లాక్డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని... లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో వైద్య సేవలు, పేషేంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా, టెస్టులు, ట్రీట్ మెంట్ ఆగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని నిరూపణ అయిందని... ఈ లాక్ డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని తెలిపారు.