ఏప్రిల్ 26న త్రిపురలోని వెస్ట్ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్(డీఎం) ఓ పెళ్లిలో దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఈ కేసుకు సంబంధించి సోమవారం త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. డీఎం శైలేష్కుమార్ యాదవ్ను విధుల నుంచి తప్పించింది. కొవిడ్-19 అమలు చేసే ప్రయత్నంలో పెళ్లి వేడుక వద్దకు వచ్చి.. కొవిడ్ నిబంధనలకు విరుద్ధం అని చిందులు వేస్తూ.. పెళ్లిని నిలిపివేయించారు. అలాగే వరుడితో పాటు అక్కడే ఉన్న ఆడా మగ అని చూడకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలు ఆషిష్ సాహా, సుశాంత చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు త్రిపుర ప్రధాన కార్యదర్శి మనోజ్కుమార్కు లేఖ రాశారు. దీంతో త్రిపుర (పశ్చిమ) జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) శైలేష్కుమార్ యాదవ్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.