అష్ట దిగ్బంధం... అక్కడ నేడు, రేపు సంపూర్ణ లాక్ డౌన్..!
గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మొత్తం 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 216 కేసులు యాక్టివ్గా ఉండగా, 8 మంది కరోనా బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలోనే జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటపై ప్రత్యేక దృష్టి సారించింది.
క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన వాటిలో 109 కేసులు రూరల్ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే.
దీంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు.