కరోనాపై యుద్ధం: యూపీలో 20 మంది పోలీసులకు కరోనా!
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ కేసులు ముప్పై వేలకు చేరువయ్యాయి. గడిచిన 24గంటల్లో 62 మరణాలు, 1,543 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మన దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఉత్తరప్రదేశ్ పై పంజా విసిరుతోంది. యూపీలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు తాజాగా కరోనా సోకింది. కాన్పూర్ సిటీలోని మొరదాబాద్ లో 20 మంది పోలీసులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ముంబాయిలో ఇప్పటికే ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.
బిజ్నోర్, వారణాసి, ఆగ్రా, మొరదాబాద్ లో పనిచేస్తున్న 20 మందికి కరోనా పాజిటివ్ రావడంతో..వారిని ఆయా ప్రాంతాల్లోని హాస్పిటల్ కి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసులకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పోలీసులు ఎవరెవరిని కలిశారు.. వారి కుటుంబ సభ్యుల, సన్నిహితుల వివరాలు సేకరించే పనిలో ఉన్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.