నాడు వైఎస్ ఐడియా నేడు దేశానికే ఆదర్శమైందిలా...!
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ప్రతీ పథకం పేదల బతుకు చిత్రాన్ని మార్చింది. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపింది. దూరమైపోతున్న ఉన్నత విద్యను పేద విద్యార్థుల చెంతకు చేర్చింది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల్లో పావలా వడ్డీ పథకం మాత్రం పొదుపు సంఘాల చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఈ పథకం అమలుతో పొదుపు సంఘాల రూపురేఖలే మారిపోయాయి. సంఘాల నిర్వహణలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని సంఘాలు అయితే..ఏకంగా బ్యాంకుల మాదిరిగా మారిపోయాయి. ఇదే సమయంలో సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ సకాలంలో రుణాలు చెల్లించే శాతం పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే సంఘాల్లోనే భారీ సంఖ్యలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. పొదుపు సంఘాల సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి పావలా వడ్డీ పథకం ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఈ పథకమే కేంద్రం ఆలోచనను మార్చింది. నాడు వైఎస్సార్ ఐడియా నేడు దేశానికి ఆదర్శం అవుతోంది. పావలావడ్డీ పథకం వల్ల మన రాష్ట్రంలో మహిళలు పొదుపు సంఘాల్లో చేరడానికి చూపిన ఆసక్తి చూసి, కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా 250 జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ జిల్లాల్లోనూ పావలా వడ్డీ పథకం సత్ఫలితాలను సాధిస్తే.. ఇక దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.