పేషెంట్ లను సరైన సమయానికి ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడటం అంబులెన్స్ డ్రైవర్ డ్యూటీ కానీ ఓ గర్బిణికి కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు అడ్మిట్ చేసుకోకుండా వేరే ఆస్పత్రికి పొమ్మన్నారు. దాంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో పురిటినొప్పులు రావడంతో డ్రైవరే డాక్టరై పురుడు పోశాడు. సమయస్పూర్తితో వ్యవహరించి తల్లీ బిడ్డ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.... ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కల్యాణి అనే గర్భిణి నెలలు నిండాయి. దాంతో కాన్పు కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి కోసం వెళ్లింది. అయితే ప్రసవానికి ముందు ఫార్మాలిటీగా కల్యాణికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . దాంతో ఆస్పత్రి వైద్యులు తాము ప్రసవం చేయలేమని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని రిఫర్ చేశారు . ఈ నేపథ్యంలో గురువారం పెద్దాస్పత్రికి చెందిన అంబులెన్స్ లో కల్యాణిని వరంగల్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
వరంగల్ వెళుతున్న దారిలో తిరుమలాయపాలెం వద్ద కల్యాణికి పురిటినొప్పులు వచ్చాయి. దాంతో వెంటనే అంబులెన్స్ డ్రైవర్ వెంకట్రావ్ వాహనాన్ని పక్కకు ఆపివేశాడు . గర్బిణికి పురిటి నొప్పులు ఎక్కువై బిడ్డ భయటకు వస్తున్న సమయంలో వెంకట్రావ్ సమయస్పూర్తితో వ్యవహరించి బిడ్డను భయటకు తీశాడు.దాంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా కల్యాణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే వెంకట్రావ్ తల్లీ బిడ్డను ఖమ్మంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు . ఇక ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని తల్లికి కరోనా చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సమయస్పూర్తితో వ్యవహరించి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ వెంకట్రావ్ ను వైద్యులు అభినందించారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుండటంతో వెంకట్రావ్ ను పలువురు అభినందిస్తున్నారు .