మనం రకరకాల కంపెనీలు తయారు చేసిన అల్ట్రాబుక్లను చూస్తున్నాం. లాప్టాప్లు ఇంత సన్నగా వస్తున్నాయా అని ఆశ్చర్యపోతూనూ ఉన్నాం. తాజాగా HP సంస్థ విడుదల చేసిన HP Spectre లాప్టాప్ని ఒక్కసారి చూస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇంతకన్నా పల్చని లాప్టాప్ ప్రపంచంలో ఎక్కడా లభించదు.
జూన్ 21న HP సంస్థ ఈ HP Spectre లాప్టాప్ని ఇండియాలో విడుదల చెయ్యబోతోంది. దీనికి సంబంధించిన మీడియా ఆహ్వానాలను కూడా ఇప్పటికే పంపేసింది. కేవలం AAA బ్యాటరీ అంత మందం కలిగి ఉండే ఈ లాప్టాప్ లెక్క ప్రకారం 10.4 mm మందాన్నీ 1.1 కేజీల బరువు కలిగి ఉంటుంది.
HP Spectreలో ఆరవ తరం i5 మరియు i7 ప్రాసెసర్లు అమర్చబడ్డాయి. విక్రయించబడే మోడల్, వాటి ధరని బట్టి ఏ ప్రాసెసర్తో లభిస్తుందన్నది ఉంటుంది. US కరెన్సీ ప్రకారం 1249 డాలర్లు (అంటే రూ. 83,397) ధర పలుకుతోంది. భారతీయ మార్కెట్లో ఎంత ధరకు లభిస్తుందన్నది జూన్ 21న తెలుస్తుంది. 13.3 అంగుళాల గొరిల్లా గ్లాస్ స్క్రీన్ని కలిగి ఉన్న ఈ లాప్టాప్ 1920x1080p Full HD రిజల్యూషన్ని అందిస్తుంది.
అలాగే అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ రేట్ కలిగిన 512 GB SSD హార్డ్ డిస్క్, 8 GB మెమరీ HP Spectreలో లభించబోతున్నాయి. బ్యాటరీ పరంగా రెండు పల్చని ముక్కలుగా విభజించబడిన సరికొత్త హైబ్రిడ్ బ్యాటరీ టెక్నాలజీ ఈ లాప్టాప్లో వాడబడింది. ఇది తొమ్మిదిన్నర గంటల వరకూ బ్యాటరీ బ్యాకప్ని ఇవ్వగలుగుతుంది. మూడు USB Type C పోర్టులు ఈ లాప్టాప్లో పొందుపరచబడ్డాయి.