శ్రావణ వేళ : వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఇదే ..!

Divya
శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజును అత్యంత పవిత్రంగా మహిళలు నోములు నోచు కుంటారు. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మీ మాత మరింత ప్రసన్నం అవుతుందట. అయితే వరలక్ష్మీ మాత ప్రసన్నం అయితే , అప్పుడు ఇంట్లో సుఖ శాంతులు, సిరి సంపదలు అన్ని వేళల ఇంట్లో కొలువై ఉంటాయని నమ్మకం. అందుకే ఆడవారు గడపలకు పసుపు బొట్టులతో ,మామిడి తోరణాలతో ఎంతో పవిత్రంగా అలంకరించి ,ఈశాన్య దిక్కున కలశ స్థాపన చేస్తూ ఉంటారు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున వరలక్ష్మి మాతను ప్రసన్నం చేసుకోవాలంటే, అందుకు కావలసిన పూజ సామాగ్రి ఏమిటి అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లక్ష్మీ అమ్మవారు ఆకుపచ్చని చీరలో, తామర పువ్వు మీద కూర్చొని, వెనుక కలశం వుండి, ఇరువైపులా ఏనుగుల బొమ్మలు ఉండే లక్ష్మీ మాత పటాన్ని ఎంచుకోవడం అత్యంత అవశ్యం. రాగి లేదా వెండి కలశం పూజ కోసం కావాలి. రెండు కొబ్బరికాయలు.ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు.. రెండు జాకెట్ ముక్కలు.. ఒకటి కలశము పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీర తోపాటు వాయనంగా ఇవ్వడానికి. ఇక ముత్తైదువులకు కూడా వాయనంగా జాకెట్ ముక్క లను ఇవ్వాలనుకునే వారు, వారి శక్తి కొలదీ తెచ్చుకొని తాంబూలంలో పెట్టి ఇస్తే సరిపోతుంది.

2పీటలు..ఒకటి  అమ్మవారి పటాన్ని పెట్టేందుకు, రెండవది కలశాన్ని స్థాపించడానికి.. 2 పీటలు లేనప్పుడు 2 అరిటాకులలో కలశాన్ని  ఉంచడానికి ఉపయోగించుకోవచ్చు. అర కిలో బియ్యం, కలశం కింద పోయడానికి. అరకిలో ఉడికించిన సెనగలు, అమ్మవారికి.. ముత్తయిదువులకు పంచడానికి. మిరియాలు, యాలకులు.. అమ్మవారికి పానకం అంటే ఇష్టం అని చెబుతారు.. యాలకులు, మిరియాలు వేసి అమ్మవారికి పానకం నైవేద్యంగా పెట్టడం శుభప్రదం. పెసరపప్పు తో అమ్మవారికి వడ నైవేద్యంగా ప్రసాదించాలి. ఇక ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు కుడుములు, బొప్పట్లు, క్షీరాన్నం , పెరుగన్నం, పులిహోర, దద్ధోజనం వంటి వాటిని అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించవచ్చు.
అంతేకాకుండా అరటి పండ్లను అమ్మవారికి కచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే, శుభప్రదమని చెబుతారు. ఐదు రకాల పూలు లేనిపక్షంలో తెలుపు, ఎరుపు ఉండే పూలను ఖచ్చితంగా తీసుకోవాలి. రెండు పూలమాలలు తీసుకోవాలి.. ఒకటి అమ్మవారి పటానికి , మరొకటి కలశానికి. ముగ్గు వేయడానికి బియ్యంపిండి, పసుపు, కుంకుమ, 2 డజన్ల గాజులు, పూజలో ఉంచడానికి ఆకుపచ్చ లేదా ఎరుపు లేదా తెలుపు రంగు కలిగిన  చీరను వుంచడం మరీ మంచిది. గంధం ,తమలపాకులు, దారం , ఖర్జూరాలు ,వక్కలు, చిల్లర నాణాలు. దీపారాధన సామాగ్రి, ఆవు నెయ్యి ఇవన్నీ తప్పక ఉంచుకోవాలి. తామర వత్తులు , ఇరువైపుల దీప ప్రమిదలు తీసుకోవాలి. ఈ దీపపు ప్రమిదలు వరి పిండితో చేసిన అయితే మరి శ్రేయస్కరం.
ఈ సామాగ్రిని తీసుకున్న తర్వాత అమ్మవారిని పూజించి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి.
శ్రీ వరలక్ష్మీ  మాతా నమోస్తుతే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: