హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న
జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు భలే ఇరికించేశారు. 17వ తేదీన ఉపఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని కామెంట్ చేసిన అచ్చెన్న వీడియో చాలా వైరల్ అయ్యింది. సరిగ్గా పోలింగ్ కు ముందు ఎక్కడో టిఫిన్ తింటు చాలా లీజర్ గా అచ్చెన్న బయటపెట్టిన మనసులోని మాట పార్టీలో సంచలనమైంది. ఒకవైపు ఉపఎన్నికలో టీడీపీనే గెలుస్తుందని చంద్రబాబు, లోకేష్ అండ్ బృందం ప్రచారంలో ఊదరగొడుతున్నారు. ఇదే సమయంలో పార్టీకి భవిష్యత్తే లేదంటు అచ్చెన్న చేసిన వ్యాఖ్యల వీడియోతో అందరి గాలిని ఒక్కసారిగా తీసేసినట్లయ్యింది. స్వయంగా పార్టీ అధ్యక్షుడే పార్టీ భవిష్యత్తు గురించి చెప్పేసిన తర్వాత ఇక ఉపఎన్నికలో టీడీపీ విజయం కోసం ఎంతమంది నేతలు గట్టిగా పనిచేసుంటారో చెప్పాల్సిన అవసరంలేదు.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఉపఎన్నిక అయిపోయింది. పోలింగ్ శాతం చాలా దారుణంగా పడిపోయింది. 2019లో 80 శాతం నమోదైన ఓటింగ్ తాజా పోలింగ్ లో 64 శాతం దగ్గరే ఆగిపోయింది. దీంతో టీడీపీకి అప్పటి ఎన్నికతో పోలిస్తే తాజా ఎన్నికలో 16 శాతం ఓట్లు బొక్కపడినట్లుగా అర్ధమైపోతోంది. అంటే అచ్చెన్న చెప్పిన బొక్క జోస్యం అక్షరాల నిజమైపోయింది. పార్టీ పరువును నడిరోడ్డుమీద పడేసిన అచ్చెన్న విషయంలో చంద్రబాబు ఏమిచేస్తారు ? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా ? లేకపోతే ఎటువంటి చర్యలు లేకుండానే అలా వదిలేస్తారా ? ఇఫుడిదే అంశంపై పార్టీలోని నేతల మధ్య చర్చ జరుగుతోంది.