మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో భాగంగా శ్రీలంక, భారత జట్ల మధ్య గత ఆదివారం జరగాల్సిన మొదటి టీ 20 ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం వల్ల రద్దయింది. ఇక రెండో టీ 20 ఈరోజు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం లో జరుగనుంది. ఇటీవల గాయం కారణంగా పలు సిరీస్ లకు దూరమైన భారత యువ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈమ్యాచ్ ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో అందరి చూపు అతని పైనే వుంది. అలాగే బుమ్రా తోపాటు గత కొంత కాలంగా గాయాల బారిన పడుతూ పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరమవుతున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ మ్యాచ్ తో పునరాగమనం చేస్తున్నాడు. రోహిత్ కు విశ్రాంతినివ్వడంతో రాహుల్ తో కలిసి ధావన్ ఓపెనింగ్ కు రానున్నాడు.
మరో వైపు దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ టీ 20లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు శ్రీలంక మాజీ సారథి ఏంజెలో మాథ్యూస్ . దాంతో శ్రీలంక అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈమ్యాచ్ లో గెలిచి ఈఏడాది ని విజయం తో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో వున్నాయి. అయితే హోల్కర్ స్టేడియం లో తిరుగులేని రికార్డు ఉండడం టీమిండియాకు కలిసి రానుంది. ఇప్పటివరకు ఇక్కడ భారత్ 8 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడగా అన్నింట్లో విజయం సాధించింది.
భారత జట్టు (అంచనా) :
శిఖర్ ధావన్ , కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్) , రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే ,రవీంద్ర జడేజా, సుందర్ , కుల్దీప్ యాదవ్ /యుజ్వేంద్ర చాహల్ , బుమ్రా, నవదీప్ సైని/శార్దూల్ ఠాకూర్
శ్రీలంక జట్టు (అంచనా) :
దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దసున్ శనక, కుశాల్ పెరీరా, రాజపక్సా ,ఇసురు ఉదాన, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లసిత్ మలింగ (కెప్టెన్), లాహిరు కుమార /కసున్ రజిత