జగనన్న అప్పు : విశాఖ తాకట్టు !
జగనన్న ఏం చేసినా రాష్ట్రం మంచి కోసమే అని ఎప్పుడో తేలిపోయింది. తేల్చేశారు కూడా! ఎంతైనా మనకు లక్ష కోట్ల సంక్షేమం కావాలి కనుక ఓ పాతిక కోట్లు అప్పు కూడా కుదరాలి. ఆ పని జగనన్న చేశారు. విశాఖ నగరంలోనే విలువైన ఆస్తులను తనఖా పెట్టేశారు. దీంతో స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎస్బీఐ క్యాప్ కు లోన్ అప్లై చేసుకుని, తొలి విడతలో 21500, మలి విడతలో మూడు వేల కోట్లు లాగేశారు. స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలను మినహాయించాలని జీఓ కూడా పాస్ చేసేశారు. దీంతో జగనన్న ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 250 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కూడా! ఆ విధంగా కూడా ఆ సంస్థ ఆదాయాన్ని ఆపేసింది. దీంతో విశాఖ నగరంలో అత్యంత విలువయిన ప్రభుత్వ స్థలాలు, భవనాలు బ్యాంకు తనఖాకు వెళ్లిపోయాయి. సెప్టెంబర్ 27 నే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. మరో 17 వేల కోట్ల అప్పు కోసం ఎస్బీఐ క్యాప్ ను అడిగారు కూడా! అందుకు సంబంధించి ఎక్కడెక్కడి ఆస్తులు తెస్తారో ఏంటో?