మంచిమాట : నీలో నీవు మమైకం కానినాడు ఏ విషయమైనా కష్టంగా అనిపిస్తుంది..!

Divya
ఒకానొక సమయంలో పంట పొలానికి కాపు కాస్తున్న రైతు అలాగే దారి వెంట వెళ్తున్న ఒక సన్యాసి .. ఆ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మిట్టమధ్యాహ్నం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక చెట్టు నీడకు చేరుకున్నారు.

ఆ సన్యాసి, రైతును పలకరిస్తూ.. ఏవయ్యా..పొలం నీదేనా? ఈ పంట చాలా బాగున్నది. ఈ యేడు కూడా సకాలం లో వర్షాలు కురవవచ్చా"? అని అడిగాడు.
ఆ రైతు, సన్యాసికి నమస్కరించి "స్వామి చేతికి దక్కిన తర్వాతే కదా..! పంట దిగుబడి ఎంతో తెలిసేది. వర్షాలు ఎప్పుడు..? ఎలా..? ఉంటాయో..? ఎవరు చెప్పగలరు.! ఇంతకు తమ  ప్రయాణం ఎంత దాకా?"అని అడిగాడు.

సన్యాసి అటు వైపు వున్న  కొండల కేసి చూపిస్తూ ,"అక్కడ గొప్ప జ్ఞాని అయిన సిద్ధుడు  ఒక ఆయన వున్నాడు. జ్ఞానోపదేశం కోసం అక్కడికి వెళ్తున్నాను."అదే విచారంగా  ముఖంపెట్టి, "ఇంతకు ముందు నేను సేవించుకున్న ముగ్గురు గురువులూ, నాకు ఆత్మజ్ఞానం కలిగేలా చేయలేకపోయారు. ఈ సారి నా అదృష్టం ఎలా ఉందో మరి ! "అని నిట్టూర్చాడు.

రైతు నవ్వి "40 యేళ్ల నుంచి ఫలసాయం, 50 యేళ్ల నుంచి వర్షాలు చూస్తున్నాను. రేపు  అనేది ఎలా వస్తుందో తెలుసుకోవడానికి, ఇన్నేళ్ల సొంత అనుభవం ఎందుకు పనికి రాలేదు. మరి ఇతర అనుభవాల మీద తమరు ఆత్మజ్ఞానం పొందటం ఎంత కష్టమో గదా పాపం!"అన్నాడు కొండల కేసి చూస్తూ..
సన్యాసికి ఈ మాటలతో చప్పున జ్ఞానోదయమై, తనను తాను సొంతంగా తెలుసుకోవాలని బోధపడి, మరొక దిక్కుగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇది చదివిన తర్వాత మీకు ఏం అర్థం అయింది.. అంటే మొదట మనల్ని మనం తెలుసుకోవాలి.. మనతో మనం మాట్లాడుకోవాలి.. ఎప్పుడైతే మనతో మనం చర్చించుకుంటామో, మనకున్న కొద్దిపాటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.. కాబట్టి ఎవరైనా ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ,ముందు మన గురించి మనం పూర్తిగా తెలుసుకోగలిగిన తర్వాత ఏ విషయంపై నైనా దృష్టి సారించాలి. అప్పుడే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: