ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో దేశాధినేతను ఫిదా చేసేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారతదేశ పర్యటన సందర్భంగా చెన్నై సమీపంలోని మామల్లపురంలో ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. నిన్నటి భేటీ సందర్భంగా మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలు అర్జున తపస్సు, కృష్ణుడి వెన్నముద్ద రాయి, ఐదు రథాలు, షోర్ టెంపుల్ కాంప్లెక్స్ను ఇరువురు నేతలు సందర్శించారు.దానికి కొనసాగింపుగా, తమిళనాడులోని కోవలమ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోదీ మధ్య భేటీ జరిగింది. భారత్ ఇచ్చిన ఆతిథ్యాన్ని తెగ ఎంజాయ్ చేసినట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తెలిపారు.
చెన్నై సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోదీతో పాటుగా చైనా, భారత్కు చెందిన ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ భేటీకి హాజరయ్యారు. గత రెండు వేల ఏళ్ల నుంచి భారత్, చైనా ఆర్థిక శక్తులుగా ఉన్నాయన్నారు. తమిళనాడు, చైనా మధ్య బలమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. చెన్నై సమావేశం రెండు దేశాల మధ్య కొత్త బంధాన్ని ఏర్పరిచిందని ఇవాళ ప్రధాని మోదీ తెలిపారు. వూహన్ సమ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. రెండు దేశాల మధ్య విశ్వాసం పెరిగిందన్నారు. చెన్నై విజన్తో కొత్త శకం ఆరంభమైందన్నారు.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ మామల్లపురంలో తామిద్దరం స్నేహితుల్లా మాట్లాడుకున్నామన్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై మనస్ఫూర్తిగా చర్చించుకున్నామని జిన్పింగ్ చెప్పారు. ``భారతదేశం ఇచ్చిన ఆతిథ్యం తమను అమితానందానికి గురి చేసింది. నేను, మా అధికారులంతా ఇదే ఫీలింగ్తో ఉన్నాం. ఈ అనుభవాలు.. తనకు, తన బృందానికి చిరకాల స్మృతులగా మిగిలిపోతాయి` అని జిన్పింగ్ చెప్పారు.