ఆగస్టు అంటే ... హడలిపోతున్న తమ్ముళ్లు
ఆగస్టు నెల వస్తుందని అంటేనే టిడిపి నేతలు హడలిపోతున్నారు. ఎందుకంటే ఆగస్టు నెలలో ఏదో ఒక సంక్షోభం ముంచుకొస్తుందని టిడిపి నేతలు బలంగా నమ్ముతున్నారు. మరో మూడు రోజుల వ్యవధిలో ఆగస్టు నెల ప్రారంభం కానుండ డంతో అసలు ఈసారి ఎటువంటి ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బిజెపి నాయకత్వం తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ , ఆ పార్టీకి చెందిన గ్రామ స్థాయి నేతల నుంచి మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది .
తెలంగాణలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను, అధికార టీఆర్ఎస్ తమ వైపు తిప్పు కుని తమ పార్టీ లో విలీనం చేసుకున్నట్లుగానే , ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అదే ఎత్తుగడ వేయాలని పథకరచన చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే టీడీపీ కి చెందిన నల్గురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ నాయకత్వం, ఇటీవల ఆ పార్టీ కి చెందిన కీలక నేతలను కూడా తమ పార్టీలో చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రూపం లో పొంచి ఉన్న ప్రమాదం ఎక్కడ తమకు ఇబ్బందులు తెచ్చి పెడుతుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు . తెలుగుదేశం పార్టీకి కలిసిరాని ఆగస్టు నెలలో అనేక సంక్షోభాలు చోటుచేసుకున్నాయి.
1984 ఎన్టీఆర్ ను గద్దె దించి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యింది కూడా ఆగస్టు నెలలోనే కావడం ఆ పార్టీకి ఆగస్టు నెల కలిసిరాదనే సెంటిమెంట్ ఏర్పడింది . ఆ తర్వాత ఎన్టీఆర్ ను పదవీచ్యుతున్ని చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పీఠాన్ని అధిష్టించింది కూడా ఆగస్టు నెలలోనే కావడం గమనార్హం . తెలుగుదేశానికి మాయని మచ్చగా మిగిలిన బషీర్ బాగ్ కాల్పులు సంఘటన కూడా ఆగస్టు నెలలోనే జరిగింది . ఇక చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించింది కూడా ఆగస్టులోనే కావడం విశేషం. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు లాల్ జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మరణించింది కూడా ఆగస్టులోనే కావడంతో... ఆగస్టు నెల వస్తుందంటేనే టిడిపి నేతలు వణికిపోతున్నారు .