రెండేళ్ళు మంత్రిగా పనిచేసినా తనదైన ముద్రను రాజకీయంగా వేసుకోలేకపోయారు లోకేష్. ఆయన భాష, మాట్లాడే తీరుపై సొంత పార్టీలోనే అభ్యంతరాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినా ఎమ్మెల్సీ చూరు పట్టుకుని వేలాడుతున్నారంటూ సాటి ఎమ్మెల్సీ, నిన్నటి టీడీపీ తమ్ముడు అన్నం సతీష్ ఘాటుగా విమర్శించినా పట్టని చినబాబు చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే, టిడిపి అధినేత చంద్రబాబు దారిలోనే లోకేష్ పయనిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న మాదిరే లోకేష్ కూడా విమర్శలు చేస్తున్నారు.జగన్ అప్పుడే మాట తప్పుతున్నారట. మడమ తిప్పుతున్నారట. శాసనమండలిలో లోకేష్ చేసిన ప్రసంగం ఇది. సీఎం జగన్ ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారని, మడమ తిప్పుతున్నారని , ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్లో మరొకలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని లోకేష్ అన్నారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? అని లోకేశ్ నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన సీఎం జగన్.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు విత్తనాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని.. వాళ్లను క్యూలైన్లలో నిల్చోబెట్టి చంపేస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. మొత్తానికి కొత్త ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందో కూడా తెలుసుకోకుండా లోకేష్ అపుడే బండలు వేస్తున్నాడంతే చంద్రబాబుకు అచ్చమైన వారసుడే మరి.