తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్పై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారా? సంచలన కారణాన్ని పేర్కొంటూ....టీడీపీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? ఈ తిరుగుబాటును నమ్మినబంటే ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీలో కీలక నేతగా ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీకి గుడ్బై చెప్పడం, ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్ల వెనుక అసలు కారణం ఇదేనని పలువురు పేర్కొంటున్నారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేనంత ఘోర ఓటమిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాజయం నుంచి తెలుగు తమ్ముళ్లు బయట పడక ముందే.. ఆ పార్టీలోని ముఖ్యనేతలు జంప్ జిలానీలు అవుతున్నారు. పార్టీ ఓటమి, నేతల జంపింగ్స్కు తోడు కార్యకర్తలపై దాడులతో తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో కేడర్కు చేరువై భరోసానివ్వాల్సిన ఆ పార్టీ యువ నాయకుడు లోకేష్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు సహా పార్టీ నేతలంతా వైసీపీ తీరును విమర్శిస్తున్నారు. కానీ, లోకేష్ మాత్రం ఏ ఘటన జరిగినా ట్విటర్లోనే స్పందిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదనే ఆలోచనలో పార్టీ ముఖ్యనేతలు బీజేపీ, వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు-లోకేష్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన లోకేష్, రోజుకు రెండు మూడు ట్వీట్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఒకటి రెండు సార్లు మినహా.. ఇప్పటివరకు మీడియా ముందు కానీ, బహిరంగ వేదికలపై కానీ లోకేశ్ గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే, దీనిపై కూడా లోకేష్ ట్విటర్లో కౌంటర్ ఇస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై కానీ, ప్రభుత్వం విషయంలో గానీ…లోకేష్ ట్విట్టర్ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు.
కార్యకర్తలు, పార్టీ నేతలతో కలవకుండా...ట్విటర్లో సానుభూతి ప్రకటించి..ట్విటర్ లోనే ధైర్యంగా ఉండండి అని కార్యకర్తలకు చెబుతున్న లోకేష్ తీరుతో పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? పార్టీ బలోపేతం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా సతమతం అయిపోయి వ్యక్తం చేసిన వారిలో అన్నం సతీష్ ఒకరని పేర్కొంటున్నారు.