అవును! మాటలు చెప్పడం కాదు..చేతల్లో చూపిస్తానంటూ.. ప్రజలకు చెప్పిన మాటలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్న సీఎం జగన్.. తాజాగా ఇలాంటి సంప్రదాయాన్నే అసెంబ్లీలోనూ కొనసాగించారు. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో స్పీకర్గా సభాపతి స్థానంలో కూర్చున్న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి విజయం సాధించిన తమ్మినేని సీతారాంను ఉద్దేశించి చేసిన ప్రసంగం నభూతో.. నభవిష్యతి. అన్నవిధంగా సాగింది. ఈ క్రమంలోనే సభా నేతగా సీఎం జగన్ చేసిన ప్రకటన, ప్రసంగం ఆద్యంతం అందరినీ విస్మయానికి గురి చేసింది.
గత చంద్రబాబు ప్రభుత్వం సభలో చేసిన ఆగడాలు, దురాగతాలను వెల్లడిస్తూనే.. తాను ఎలా ఉంటాడో.. సభాపతి ఎలా ఉండాలని తాను కోరుకుంటున్నారో.. జగన్ విస్పష్టంగా చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గోడదూకేందుకు ప్రోత్సహిం చడం, వారిని అధికార పార్టీలోకి చేర్చుకుని పదవులు కట్టబెట్టడం అనే దుష్ట సంప్రదాయాన్ని నిలువెల్లా కడిగి పారేసిన జగన్.. తన హయాంలో అలాంటి పరిస్థితి రానేరాదని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు పార్టీ మారాలని భావిస్తే.. తాను అతనిని పార్టీలోకి ఆహ్వానించాలని అనుకుంటే .. వెంటనే ఆ సభ్యుడి పదవికి రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తానని సభా ముఖంగానే చెప్పడం జగన్ నిబద్ధతకు కొలమానం.
అదేసమయంలో విస్తృత అధికారాలు ఉన్న సభాపతి కూడా ఇలాంటివి జరిగినప్పుడు చూస్తూ.. కూర్చోకుండా.. తనకున్న పవర్స్ను పూర్తిగా వినియోగించి, సభ్యులపై డిస్క్వాలిఫికేషన్ కత్తిని ఝళిపించాలని కూడా కోరడం జగన్ను ఉన్నతస్థా యికి చేర్చింది. ఇక, సభాపతిగా నిస్వార్థంగా వ్యవహరించాలని, అసెంబ్లీ నిబంధనలు ఏం చెబుతున్నాయో? ఎలా నడిస్తే.. సభ ఖ్యాతి ద్విగుణీకృతమవుతుందని రాజ్యాంగం చెబుతోందో.. అలానే వ్యవహరించాలని కూడా జగన్ సభా ముఖంగా కోరడం.. నిజంగా రాష్ట్రంలో ఓ అభ్యుదయ రాజకీయం చైతన్యం అయిందనడానికి నిదర్శనంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనా.. సభాపతిగా సీతారాం ఎన్నిక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.