కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇప్పటికే కాంగ్రెస్ ను వీడి తెరాస లో చేరిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో హుజుర్ నగర్ కు త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుంది.
ఇదిలా ఉంటె, ఇప్పుడు ఆ పార్టీకి మిగిలింది ఆరుగురు ఎమ్మెల్యేలే. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలలో మరో ఇద్దరు కూడా తెరాస పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. అనుకున్నట్టుగా అన్ని కలిసి వస్తే రేపోమాపో ఆ ఇద్దరు కూడా తెరాస లో చేరిపోతారు.
అప్పుడు కాంగ్రెస్ కు మిగిలేది కేవలం నలుగురు మాత్రమే. ప్రతిపక్ష హోదా పోవడంతో కాంగ్రెస్ పార్టీ మరింత డీలా పడింది. అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలడంతో.. తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీ శ్రద్ధ పెట్టలేకపోతున్నది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలి అంటే.. కేంద్రం బలమైన నాయకులను రాష్ట్రానికి పంపాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.. ఎప్పటికైనా తిరిగి అధికారంలోకి వస్తుంది అని పార్టీ కార్యకర్తలకు చెప్పాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణాలో బలం పుంజుకుంటుంది.