ఏపిలో గత నెల 23న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. 30న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సంతకం వృద్దాప్య పెన్షన్ పై పెట్టి తాను ప్రజల మనిషిని అని మొదట రోజే చెప్పారు. నేడు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం 8:39 గంటలకు సచివాలయంలో అడుగుపెట్టారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ సచివాలయంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. జగన్ ఉదయం 9.30 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మరోసారి తనను నమ్ముకున్న వారికి మంచి చేయడమే తన ఉద్దేశ్యం అని తెలియజేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి విధేయుడిగా ముద్రపడిన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ చీప్ విప్ పదవిని కట్టబెట్టారు. మంత్రి పదవిని ఇవ్వని కారణంగా పార్టీ ఆవిర్భావం నుండి తన వెంట నడిచినందుకు శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవిని కట్టబెట్టారు.
జగన్ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి నలుగురికి మాత్రమే పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, కాపు సామాజిక వర్గాలకు జగన్ తన మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. సామాజిక వర్గాల వారీగా కూడ సమతుల్యత పాటించే ప్రయత్నం చేశారు. మంత్రి పదవులు దక్కని వారికి చీప్ విప్ , విప్లుగా నియమించారు.