ఏపీలో ఇక వరుస పెట్టి ఎన్నికల మోత మోగిపోనుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యి కేబినెట్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే పరిపాలనపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ఈ క్రమంలోనే వరుసగా పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ ప్రభంజనం జోరుగా ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్స్వీప్ చేయనుంది. ఇక ఈ క్రమంలోనే ఏపీలో త్వరలోనే శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో మండలి నుంచి ఆరు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ నుంచి ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఉన్నారు. కేశవ్ రాజీనామాతో అనంత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఖాతాలోనే పడనుంది. ఇక ప్రకాశం జిల్లా చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం కూడా తన పదవికి రాజీనామా చేయడంతో ఆ సీటు కూడా ఖాళీ కానుంది.
ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉన్నారు. ఆయన ఏలూరు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాజా గెలుపుతో నాని కూడా తన పదవిని వదులుకోనున్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారు. దీంతో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడంతో మొత్తం నాలుగు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి.
ఇక ఎన్నికలకు ముందు బాబు కేబినెట్లో మంత్రులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నారాయణ ఇద్దరూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసి మరీ ఎన్నికలకు వెళ్లి చిత్తుగా ఓడిపోయారు. నారాయణ నెల్లూరు సిటీలో పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఇక ఓటమి అలవాటు అయిపోయిన సోమిరెడ్డి మరోసారి కాకాణి గోవర్థన్రెడ్డి చేతిలో ఓడారు.
ఓవర్ కాన్ఫిడెన్స్తో మంత్రులు ఇద్దరూ తమ ఎమ్మెల్సీ పదవులు వదులుకోవడంతో ఇప్పుడు ఉన్నది పాయే... ఉంచుకున్నది పాయే అన్న చందంగా వీరి పరిస్థితి మారింది. ఇక వైసీపీకి అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలతో పాటు అనంత లాంటి చోట్ల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూడా వైసీపీ ఖాతాలోనే పడనుంది. మొత్తంగా ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరిగే ఎన్నికల్లో ఆరు స్థానాలు వైసీపీ క్లీన్స్వీప్ చేయనుంది. ఇక మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు 2021 వరకు ఆ పదవి ఉంటుంది. లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేస్తే వైసీపీకి మరో ఎమ్మెల్సీ అదనంగా వచ్చి ఉండేది.