ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై ఓ రేంజ్లో విరుచుకుపడే వైసీపీ నేత విజయసాయిరెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారులో అవినీతి జరిగిందని భావిస్తున్న అంశంపై ఆయన సంచలన రీతిలో రియాక్టయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఇవాళ లేఖ రాశారు. కీలకమైన బిల్లులు ఆపివేయాలని కోరారు.
ఇజ్రాయల్కి చెందిన వెరింట్ సంస్థ వద్ద రూ.12.5 కోట్లు వెచ్చించి ఏపీ ప్రభుత్వం కొన్ని పరికరాలను కొనుగోలు చేసిందని.. ఆ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని లేఖలో విజయసాయిరెడ్డి కోరారు. విపక్షాల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కొన్ని పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. కానీ వీటి విషయాన్ని ఆ బిల్లుల్లో ప్రస్తావించలేదని విజయసాయి ఆ లేఖలో వివరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా ఈ పరికరాలను కొనుగోలు చేశారని విజయసాయి పేర్కొన్నారు. బిల్లులకు సొమ్ము చెల్లించే ముందు పరికరాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని విజయసాయిరెడ్డి కోరారు. కాగా, విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో అవినీతి ఆరోపణలు మరో మలుపు తిరిగినట్లయిందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ ఆరోపణల్లో కూరుకుపోగా...తాజాగా ఈ ఫిర్యాదుతో మరింతగా బుక్ అయినట్లేనని అంటున్నారు.