ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించినపుడు ఆయన పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ కార్యకలాపాలు ఎంతో చురుకుగా చూసుకునే వారు. అప్పట్లో ప్రస్తుత ఏపి సీఎం చంద్రబాబు, దగ్గబాటి వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ పైకి రావడానికి ఎంతో కృషి చేశారని చెబుతారు. కొంత కాలం తర్వాత పార్టీలో అభిప్రాయ భేదాలు రావడంతో దగ్గబాటి వెంకటేశ్వరరావు టీడీపి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఆయన తెరపైకి వచ్చారు.
మార్టూరులోని ఓ కల్యాణమండపంలో తన అనుచరులు, వైసీపీ నాయకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించిన దగ్గుబాటి, ప్రజల ఆశీస్సులతోనే మార్టూరు, పర్చూరు నియోజకవర్గాల నుంచి తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. మాటకు కట్టుబడి నిలిచే నేటితరం రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ ఒకరని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో జగన్ సమక్షంలో బుధవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించిన ఆయన, తనతో పాటు తన కుమారుడు హితేష్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీలో చేరనున్నారని అన్నారు.
చంద్రబాబు గతంలో పోలవరం వద్దన్నారని,ఇప్పుడు తానే కడతానని అంటున్నారని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారన్నారు. వ్యవస్తలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబును చూస్తే జాలేస్తుందన్నారు. దివంగత మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు గొట్టిపాటి భరత్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు.
జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టించేందుకు కూడాచంద్రబాబు ప్రయత్నించలేదన్నారు. చివరకు పురంద్రీశ్వరి ప్రయత్నంతో పెట్టగలిగామంలూ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.