ప్రతిపక్షాలకు షాక్ - అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై సుప్రీం ధర్మాసనం స్టే-కి-నో

అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జనరల్‌ కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పాలసీ కింద కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ సుప్రీం జోక్యం చేసుకోబోదని ధర్మాసనం స్పష్టం చేసింది.



అయితే ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణాలకు10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్రం నిర్ణయం అమలును నిరోధించటం కుదరదని సుప్రీం ధర్మాసం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే కేంద్రం అమలు చేయబోతున్న ఆ పాలసీని మాత్రం పరిశీలిస్తామని తెలిపింది.  అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజీవ్ కన్నాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఇలా స్పందించింది.

కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ మౌలికస్ఫూర్తికి విఘాతం కలిగించేదిగా ఉందని దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు చెబుతున్నాయి. రిజర్వేషన్లకు సామాజిక నేపథ్యాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా ఆర్థిక నేపథ్యాన్ని ప్రాతిపదికగా తీసుకోవడాన్ని పిటిషనర్స్ తప్పు పడుతున్నారు. 1992లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును పిటిషనర్లు గుర్తు చేశారు. కొత్తగా ఈబీసీ రిజర్వేషన్ బిల్లు వల్ల వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటను కొట్టివేయాలంటూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 

కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల స్టంట్‌గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. ఓక వైపు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఎన్నికలకు ముందు దీన్ని తెరపైకి తీసుకురావడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ పాలసీ ఇప్పటికే ఉభయసభల్లో ఆమోదం కూడా పొందిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: