ఎడిటోరియల్ : లోకేష్ గురించి మోడి చెప్పిందాంట్లో నిజమెంత ?
నారా లోకేష్ గురించి తాజాగా ప్రధానమంత్రి
నరేంద్రమోడి చేసిన ‘సన్
రైజ్’ అభివృద్ధి వ్యాఖ్యలు ఎంత వరకూ నిజమనే చర్చ మొదలైంది. చంద్రబాబునాయుడు
ఏపిని సన్ రైజ్ స్టేట్ అంటూ చెప్పటం వెనుక కేవలం తన కొడుకు నారా లోకేష్ (సన్ రైజ్)
అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదంటూ చేసిన కామెంట్లు ఇఫుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్
టాపిక్ అయిపోయింది. డైరెక్టుగా చంద్రబాబు, చినబాబును ప్రధాని ఎటాక్ చేసిన తర్వాత
తెలుగుదేశంపార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు. వాళ్ళు కూడా బిజెపి, మోడిపై
ఎదురుదాడికి దిగుతారనటంలో సందేహం లేదు. కాకపోతే చంద్రబాబుకు లోకేష్ రూపంలో
వారసుడున్నట్లుగా మోడికి వారసులంటూ ఎవరూ లేరు కదా ? అందుకనే మోడి వ్యక్తిత్వంపైన,
కేంద్ర ప్రభుత్వంపైన మండిపడుతున్నారు.
సరే, మోడి అన్నాడని కాదుకానీ అన్నదాంట్లో తప్పేమీ లేదు. ఇపుడు మోడి చెప్పిన విషయం రాష్ట్రంలో అందరికీ ఎప్పుడో తెలుసు. కాకపోతే మోడి ఇపుడే ఆ విషయాన్ని ప్రస్తావించారంతే. చంద్రబాబు పాలన మొత్తం కేవలం లోకేష్ ను పార్టీ, జనాల నెత్తిన బలవంతంగా రుద్దటానికే సరిపోతోందనటానికి చాలా ఉదాహరణాలే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినా తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానో లేకపోతే కీలక పదవుల్లో ఉన్నారని అనుకుందాం. రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ప్రవేశించాలనుకుంటే నేరుగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలనే వేదికగా చేసుకుంటారు. కొడుకు ఎంట్రీ కూడా గ్రాండ్ గా ఉండాలనే ఏ తండ్రైనా కోరుకుంటారు.
కానీ ఇక్కడ చంద్రబాబు, లోకేష్ ఇద్దరు రివర్సులో ఆలోచించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా దొడ్డిదోవన ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే ఎంఎల్ఏగా పోటీ చేస్తే గెలుస్తారో లేదో అన్నఅనుమానం ఉండబట్టే తండ్రి, కొడుకులు అసలు ఆ జోలికే వెళ్ళలేదు. ఇక్కడే తెలిసిపోతోంది లోకేష్ సామర్ధ్యమేంటో. రాజకీయాల్లో యాక్టివ్ అయిన దగ్గర నుండి లోకేష్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏమిటో అందరూ చూసిందే. రాజకీయ ఉపాన్యాసాల్లో లోకేష్ పదిమాటలు మాట్లాడితే అందులో 20 తప్పులుంటున్నాయి. ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు. చివరకు లోకేష్ కు తెలుగు నేర్పటానికి కూడా లక్షల రూపాయల ప్రజాధానాన్ని ఖర్చు చేస్తున్నారంటే సిగ్గుచేటే. తెలుగు వాడైన లోకేష్ చివరకు తెలుగును తప్పులు లేకుండా మాట్లాడలేదు.
సరే, ఇక రాజకీయ పరిజ్ఞానాన్ని చూస్తే అది కూడా సున్నానే. సీనియర్ నేతలను గౌరవించాలన్న కనీస జ్ఞానం కూడా లోకేష్ లో లేదు. తనను కలవాలని వచ్చిన ప్రతిభా భారతి, జేసి దివాకర్ రెడ్డిలను గంటలపాటు వెయిట్ చేయించి చివరకు తిప్పి పంపేసిన గొప్పోడు లోకేష్. అలాగే, మంత్రులు కూడా పనిమీద వస్తే కలవకుండానే వాళ్ళని తిప్పిపంపేసినట్లు పలు ఆరోపణలున్నాయి. శాఖాపరంగా ఏ మాత్రం పట్టులేకుండానే అధికారుల సాయంతో నెట్టుకొచ్చేస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతల మధ్య ఉన్న విబేధాలను కూడా లోకేష్ పరిష్కరించలేకున్నారు.
నిజానికి మీడియా బలంతో మాత్రమే తండ్రి, కొడుకులు కాలం నెట్టుకొచ్చేస్తున్నారు. వాళ్ళ తప్పులేవీ బయటపడకుండా పచ్చ మీడియా జాగ్రత్తగా కాపు కాస్తోంది కాబట్టి నాలుగున్నరేళ్ళు కాలం గడిపేశారు. తాము చేస్తున్న తప్పులను గడుసుగా ప్రతిపక్షాలపైకి నెట్టేసి ట్వట్టర్లో మాత్రమే లోకేష్ యాక్టివ్ గా కనబడుతుంటారు. అందులో కూడా చాలా తప్పులే ఉంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ ను చంద్రబాబు బలవంతంగా టిడిపి నేతలు, జనాల నెత్తిన రుద్దతున్నారు. తనలో ఎటువంటి కెపాసిటీలు లేకుండా కూడా పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా చెలామణి అయిపోతున్నారంటే కేవలం చంద్రబాబు అమలు చేస్తున్న సన్ రైజ్ పాలనీనే కారణమని తెలిసిపోతోంది. కాబట్టి చంద్రబాబు, లోకేష్ గురించి మోడి చెప్పిదాంట్లో తప్పేమీ లేదు.