కొత్త చిచ్చు: ఏపీ గ్రామాలను తెలంగాణలో కలుపుతామంటున్న కాంగ్రెస్‌?

Chakravarthi Kalyan
సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికలు అంటే కేంద్రంలో అధికారం కోసం పార్టీని ఎన్నుకునే అవకాశం. ఈ నేపథ్యంలో దేశం మొత్తం అమలయ్యేలా పార్టీ మ్యానిఫెస్టోని విడుదల చేస్తాయి. ఇలా.. కాంగ్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే విడుదల చేసింది. కానీ చిత్రంగా ఇప్పుడు తెలంగాణకు మాత్రం పరిమితం అయ్యేలా సార్వత్రిక మ్యానిఫెస్టోని విడుదల చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోను ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 12 కు పైగా స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పనిచేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆరు గ్యారంటీలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో తెలంగాణ వరకు ప్రత్యేక మ్యానిఫెస్టోని టీపీసీసీ విడుదల చేసింది.

దేశంలో ఇప్పటి వరకు ఏ జాతీయ పార్టీ కూడా.. ఎన్నికలకు రెండు మ్యానిఫెస్టోలను విడుదల చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ట్రెండ్ ను సృష్టించారు. దాదాపు 25 హామీలతో కూడిన ప్రత్యేక మ్యానిఫెస్టో ఇవ్వడం గమనార్హం.

దీనిని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపా దాస్ మున్షీ విడుదల చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను దృష్టి లో పెట్టుకొని దీనిని తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర విభజన హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని వెల్లడించారు. అదే విధంగా సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ని హైదరాబాద్ లో నెలకొల్పుతామన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వంటి కీలక హామీలు ఇందులో ఉన్నాయి. అంతే కాదు.. ఏపీలో కలిపిన ఐదు గ్రామాలకు తిరిగి తెలంగాణలో కలుపుతారట.. మరి తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: