ఏపీలో రాజకీయ సంచలనాలకు.. ప్రజాతీర్పునకు మరో మూడుమాసాల్లో తెరలేవనుంది. ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే.. కేవలం పట్టుమని 100 రోజుల్లోనే ఏపీలో పార్టీలకు అగ్ని పరీక్ష జరగనుంది. ఇప్పటి వరకు ప్రజలను ఆకట్టుకున్నది, ఒక రినొకరు విమర్శించుకున్నదీ వేరు. ఇక ఇప్పటి నుంచి జరగబోయే పరిస్తితి వేరు. ఇక, ఎన్నికలకు రంగం రెడీ అవుతు న్న నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు కీలక పార్టీలూ సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార టీడీపీ ఇప్పటికే తన హవాను చాటుకునేందుకు ``మనం రాకపోతే.. అధివృద్ధి ఆగిపోతుంది!``- అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి చంద్రబాబు తాజాగా తమ్ముళ్లకు దిశానిర్దేశం చేశారు. మనం రావాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించండి.. అని బాబు నూరిపోశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, విపక్షాల తీరును ఎండగట్టాలని కూడా ఆయన సూచించారు. ప్రధానంగా వైసీపీని రెండో స్థాయిలో జనసేనను కూడా ఎండగట్టాలని ప్రజలను ఆయా పార్టీల గురించి కూడాఆ లోచించే సమయం లేనంతగా టీడీపీ గురించే వివరించాలని సూచించారు కూడా. ఇక, జగన్ విషయానికి వస్తే.. ఆయన ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకుని త్వరలోనే బస్సు యాత్రకు సిద్ధమవు తున్నారు. నాయకులను సమీకరించి.. గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అదేసమయంలో జనసేన అన్నింటిలోనూ అంటే 175 నియోజకవర్గాల నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నామని చెబు తున్నా.. కేవలం బలం ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని, పోటికి దిగిన స్థానంలో మాత్రం గెలుపు గుర్రం ఎక్కా లని నిర్ణయించుకున్నారు.
ఇలా మూడు పార్టీల జోరు ఈ రాబోయే మూడు మాసాల్లో పెరగనుంది. అయితే, వీటిలో ఒక్క టీడీపీ మాత్రం అధికారంలో ఉండి కూడా మరింత వేగంతో ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది మా కోసం కాదు! అనే సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకు వెళ్లి విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ ఎదుర్కొంటోంది.
కానీ, జగన్ విషయానికి వస్తే.. తనకోసమే తాను సీఎం అవుతారనే ప్రచారం లోపాయికారీగా జరుతోంది. ఈ పరిణామాలు అధికార పార్టీకి కలిసి వస్తాయని అంటున్నారు. ఇటు జనసేనాని కానిస్టేబుల్ కొడుకు సీఎం అవ్వకూడదా ? అన్న సెంటిమెంట్ అస్త్రాలకు తెరలేపుతున్నారు. ఏదెలా ఉన్నా.. ఒక్క మూడు మాసాల సమయంలోనే ఏ పార్టీకైనా పుంజుకునేందుకు సమయం ఉందనేది వాస్తవం. మరి ఏ పార్టీ పుంజుకుంటుందో ? ఏపీ కొత్త సీఎంగా ఎవరు పీఠం ఎక్కుతారో ? చూడాలి.