పటీదార్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ల నేత హార్దిక్ పటేల్(25) చేపట్టిన నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నిరాహార దీక్ష పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో హర్థిక్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆహారం, నీరు లేకుండా దీక్షచేస్తానని, ఆశయం సిద్ధించేదాకా గాంధీజీ చూపిన బాటలో పోరు సాగిస్తానన్నారు. శుక్రవారం గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కనూ కల్సారియా సహా పలువురు నేతలు హార్దిక్ను కలిసి మద్దతు తెలిపారు.
హార్దిక్తో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అహ్మదాబాద్, గాంధీనగర్లలో దీక్షకు అధికారులు నో చెప్పడంతో 25న తన నివాసంలోనే హార్దిక్ దీక్ష ప్రారంభించారు. తాజాగా హీర్థిక్ పటేల్ ఆరోగ్యం పరిస్థితి క్షీణిస్తుండటంతో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. న ఆస్తులను పంచుతూ హార్దిక్ వీలునామా రాశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 50 వేలలో తల్లిదండ్రులకు రూ. 20 వేలు, పంజ్రపోల్ గ్రామంలో ఆవుల షెడ్ నిర్మాణానికి రూ. 30 వేలు ఇవ్వాలని తెలిపారు.
తన జీవితగాథపై వస్తున్న పుస్తకం 'హూ టుక్ మై జాబ్' విక్రయాల ద్వారా వచ్చే రాయల్టీ, తనపై ఉన్న బీమా డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడు సంవత్సరాల క్రితం పటీదార్ ఉద్యమం జరిగిన వేళ అసువులు బాసిన 14 మందికీ సమానంగా పంచాలని ఆయన వీలునామాలో రాసినట్టు పటీదార్ సంఘం అధికార ప్రతినిధి మనోజ్ పనారా తెలిపారు. కాగా, ఆ వీలూనామా ప్రకారం అతని ఆస్తిలో తల్లిదండ్రులకు, చెల్లెలికి 15 శాతం చొప్పున, మిగతా 70 శాతం 14 మంది మరణించిన పటీదార్ల కుటుంబాలకు చెందుతుంది.