పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి యాదవ్ భలే జోకులేస్తున్నారు. ఏపి జనాలు ఎలా కనిపిస్తున్నారో ఏమో తెలీదు కానీ రఘువీరా వేసే జోకులను తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మొత్తం 25 లోక్ సభ సీట్లూ కాంగ్రెస్ కు ఇస్తేనే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని చెప్పారు. రఘువీరా మాటలు విన్న మీడియా వారికి నవ్వాలో ఏడ్వాలో తెలీలేదు.
ఒక్కసీటులో కూడా డిపాజిట్ దక్కలేదు
ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్ కు చేసిన సత్కారం అందరికీ గుర్తుండే ఉంటుంది. 175 అసెంబ్లీ స్దానాల్లో ఒక్కటంటే ఒక్క స్ధానంలో కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కనీయలేదు. అసెంబ్లీ సీటులోనే డిపాజిట్ కూడా రాలేదంటే ఇక పార్లమెంటు సీటు గురించి మాట్లాడుకోవటం అనవసరం. పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్ధితి మరింత దిగజారిపోతుందనే చెప్పాలి.
అసలు అభ్యర్ధులు దొరుకుతారా ?
పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అన్నీ స్ధానాల్లో పోటీకి అభ్యర్ధులు దొరికారు . మరి వచ్చే ఎన్నికల పరిస్ధితి ఎలా ఉండబోతోంది. పోయిన ఎన్నికల్లోనే చాలా మంది కాంగ్రెస్ నేతలు టిడిపి, వైసిపిలో చేరిపోయారు. మిగిలిన వారిలో కూడా చాలామంది వైసిపిలో చేరిపోయారు. మిగిలిన అరా కొరా నేతల్లో కొందరు వైసిపిలోకి వెళ్ళిపోయేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్దితుల్లో కాంగ్రెస్ కు అభ్యర్ధులు దొరకటమే మహాభాగ్యమన్నట్లుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కు 25 సీట్లూ ఇస్తే ప్రత్యేకహోదా సాధ్యమని రఘువీరా చెప్పటమంటే జోకులేయటం కాక మరేంటి ?