ఏపీలో విభజన దెబ్బతో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ మాదిరిగా.. ప్రత్యేక హోదా దెబ్బతో బీజేపీ కూడా దాదాపు అదే పరిస్థితిని చవిచూస్తోంది. అయితే, ఇప్పటికీ విషయాన్ని గ్రహించని, ప్రజల నాడి పట్టుకుని తప్పు తెలుసుకోని బీజేపీ నేతలు.. ఇంకాతాము ఏదేదో ఊహించుకుంటున్నారు. ప్రజలలోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తప్పు చేసినా.. చంద్రబాబు మాదిరిగా తప్పించుకునే వ్యూహాలు ఉండాలి. కానీ, బీజేపీకి రాజకీయం ఇంకా ఒంటబట్టినట్టు లేదు. అందుకే మూడు వ్యూహాల ముచ్చట రాజకీయాలకు ఈ నేతలు తెరదీశారు. మరి అవైనా ఎంతవరకు పారతాయో చూడాలి. మరి ఆ కథా కమామీషు ఏంటో చూద్దాం..
ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ త్రిముఖ వ్యూహన్ని రచిస్తోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి తీవ్రం చేయటం అనే విషయాన్ని ప్రధానంగా ఎంచుకున్నారు. అదే సమయంలో మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇంకోవైపు ఇతర పార్టీ నాయకులను బీజేపీ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా వెళ్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం, నిధుల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారింది.
ఈ తరుణంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు పార్టీ విస్తరణపై కమలనాథులు దృష్టి పెట్టారు. రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన భాజపా ముఖ్యనేతల సమావేశంలో రానున్న మూడు నెలల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేశారు. ముఖ్యంగా చంద్రబాబును ఇరుకున పెట్టాల్సిన కార్యక్రమాలపై మార్గసూచి నిర్వహించారు. వాటిలో తొలి అడుగుగా విజయవాడలో మహాధర్నా నిర్వహించారు. ఇందులో పార్టీ ముఖ్య నేతలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే నిధులకు కొరత వచ్చిందన్నది కమల నాథుల మాట.
అయితే, దీనికి తగిన విధంగా బాబు అండ్ టీం నుంచి సరైన టార్గెట్ ఎదురు కావడంతో నోరు మూసుకున్నారు. ఇక, రెండోది.. ఇతర నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇతర నాయకులు ఎవరైనా జనసేన లేదా వైసీపీ కుదిరితే.. టీడీపీ బాటలో వెళ్తున్నారు తప్పితే.. బీజేపీ మాట పలికేందుకే భయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వారి వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వారికే తెలియాలి.