రాష్ట్రానికి అన్యాయం జరిగితే వేడుకలు ఎలా చేసుకుంటాం ? ఇది తాజాగా చంద్రబాబునాయుడు సంధించిన ప్రశ్న.
నవ నిర్మాణ దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు గురువారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన జూన్ 2వ తేదీకి సంబంధించి చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాటైతే వాస్తవమే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, జరిగిన అన్యాయంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నదే అసలు పాయింటు. అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర విభజన పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర విభజన జరిగేదేనా ? రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పాత్రుందో బిజెపి, టిడిపిలకు కూడా అంతే భాగస్వామ్యముందన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే శిక్ష ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే పడింది. ఆ విషయంలో చంద్రబాబు నిజంగా అదృష్టవుంతుడి క్రిందే లెక్క. అందుకే అవశేష ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రయ్యారు.
చంద్రబాబు వేడుకలు చేసుకోవచ్చా ?
వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబేమో రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతుంటారు. పైగా రాష్ట్రం కష్టాల్లో ఉంటే వేడుకలు ఎలా జరుపుకుంటామని అమాయకంగా ప్రశ్నిస్తూ జనాల చెవిలో పువ్వులు పెడుతున్నారు. రాష్ట్రానికి నిజంగానే అన్యాయం జరిగిందని చంద్రబాబు భావిస్తుంటే మరి ప్రతీ సంవత్సరం పార్టీ మహానాడు ఎలా జరుపుకుంటున్నట్లు ? పార్టీకి సంబంధించినంత వరకూ మహానాడంటే వేడుక క్రిందే లెక్క. మహానాడు నిర్వహణకు పార్టీ చేసే ఖర్చు, నిర్వహించే కార్యక్రమాలను చూస్తే ఎంత గ్రాండ్ గా జరుపుతారో అందరికీ అర్ధమైపోతుంది. అంటే, చంద్రబాబేమో వేడుకలు చేసుకోవచ్చా ?
అట్టర్ ఫ్లాప్ అయిన దీక్షలు
నవ నిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు జరుపుతున్న తంతు అట్టర్ ఫ్లాప్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. గడచిన నాలుగేళ్ళుగా దీక్షల పేరుతో చంద్రబాబు ఎన్నో నాటకాలు ఆడుతున్నదీ అందరూ చూస్తున్నదే. ఇపుడు కూడా దీక్షలను విజయవాడలోని బెంజి సర్కిల్ వద్దే జరుపుతారట. పోయిన ఏడాది జరిపిన దీక్షలకు జనాలే హాజరుకాలేదు. ఒకవైపు ఎండలు మాడ్చేస్తుంటే మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై దీక్షలకు ఎవరైనా హాజరవుతారా ? చంద్రబాబుకేమో వేదికపై నాలుగు వైపులా ఏసిలు పెడతారు. మరి, రోడ్డుపై కూర్చునే జనాల పరిస్ధితేంటి ? పైన ఎండ, క్రిందేమో వేడితో అదిరిపోతుంది. అందుకే చంద్రబాబు చెప్పే దీక్షలంటేనే జనాలు బెదిరిపోతున్నారు. పోయిన సారి పోలీసులతో ఎంత కట్టడి చేద్దామన్నా జనాలు వినకుండా బ్యారికేడ్లను తప్పించుకుని పారిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.