నిన్న మొన్నటివరకు అధికారం కోసం తాను రాజకీయాలలోకి రాలేదు అంటూ కామెంట్స్ చేసిన పవన్ ఇప్పుడు తన రూట్ మార్చి ఒక్క అవకాశం ఇస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అంటూ ప్రకటనలు చేయడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. జనసేన పూర్తి సాంప్రదాయ రాజకీయ పార్టీగా ట్రాన్స్ ఫామ్ కావడానికి మరికొన్నేళ్లు పట్టవచ్చని గతంలో స్వయంగా అంగీకరించిన పవన్ ఇలా యూటర్న్ తీసుకుని తాను ముఖ్య మంత్రి కావడానికి రెడీ అని ఇస్తున్న సంకేతాలు దేనికి సంకేతం అంటూ చర్చలు జరుగుతున్నాయి.
అంతేకాదు పవన్ కూడ తన జనసేన పార్టీ విషయంలో షార్ట్ కట్స్ గురించి ఆలోచిస్తున్నాడా అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ముక్కోణపు పోటీ తప్పదు అంటూ పవన్ చేస్తున్న కామెంట్స్ కర్ణాటకలో నెలకొన్న తాజారాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే అంటున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రెండు ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జేడీఎస్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ ‘కింగ్ మేకర్’ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా అదే స్థాయిలో తన జనసేన తరఫున కర్ర పెత్తనం చేయాలని పవన్ ఆలోచన అని అంటున్నారు. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం వైసీపీ దాదాపు సమఉజ్జీలుగా ఉన్న నేపధ్యంలో 2019 ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులలో ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్ననేపధ్యంలో ఈ వ్యాక్యూమ్ ను అవకాశంగా వాడుకోవాలని పవన్ ఆలోచన అని అంటున్నారు.
దీనితో ప్రస్తుత పరిస్థితులలో ఎటువంటి తప్పటడుగు వెయ్యకుండా ఏవర్గాన్నీ దూరం చేసుకోకుండా ముందుకు నడిస్తే తనకు రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ‘కింగ్ మేకర్’ అయ్యే ఛాన్స్ ఉంది అని పవన్ చాలా గట్టిగా భావిస్తున్నట్లు టాక్. దీనికితోడు ఈమధ్య పవన్ తన అభిమానులతో మాట్లుడుతూ అరుపులు కేకలతోతానూ ముఖ్యమంత్రి కాలేనని తన అభిమానులు నిజంగా తనను ముఖ్య మంత్రిగా చూడాలి అనుకుంటే ప్రజాసమస్యలు తన చెప్పమంటూ పిలుపు ఇచ్చాడు. అయితే సమస్యలకు పరిష్కారాలు చెప్పకుండా కేవలం సమస్యలు తెలుసుకుని పవన్ ఏమి చేయగలుగుతాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాలలో ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాక హంగ్ ఏర్పడిన నేపధ్యంలో పవన్ జనసేన శిబిరంలో కన్నడ డ్రీమ్స్ పెరిగాయి అంటూ కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..